జయలలిత వేలిముద్రతో రండి, బెంగళూరు సెంట్రల్ జైలు అధికారలకు హైకోర్టు ఆదేశాలు!
చెన్నై: జయలలిత వేలిముద్రలతో హాజరుకావాలని బెంగళూరు జైలు సూపరింటెండెంట్ను మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి వేలుమురగన్ ఆదేశాలు జారీ చేశారు. డీఎంకే పార్టీ వైద్యుడు డాక్టర్ శరవణన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హై కోర్టు న్యాయమూర్తి పి. వేలుమురుగన్ డిసెంబర్ 8వ తేదీలోపు జయలలిత వేలిముద్రను కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో 2014 అక్టోబర్ 18వ తేదీన జయలలిత బెంగళూరు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లారు. ఆ సందర్బంలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు జయలలిత వేలిముద్రలు సేకరించారు. 21 రోజులు జైల్లో ఉన్న జయలలిత తరువాత జామీను మీద బయటకు వచ్చారు.

2016లో జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడులోని తిరుప్పరకుండ్రం నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఎ.కె.బోస్ గెలుపును సవాలు చేస్తూ డీఎంకే పార్టీ అభ్యర్థి డాక్టర్ శరవణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
జయలలిత అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఎన్నికలో తమ అభ్యర్థికి రెండాకుల పార్టీ గుర్తు కేటాయించాలంటూ బి ఫారంలో ఉన్న ఆమె వేలిముద్రలపై అనుమానం ఉందని, ఆమె చనిపోయిన తరువాతే వేలిముద్రలు సేకరించారని డాక్టర్ శరవణన్ పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications