గోదాదేవి వివాదంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!
చెన్నై: అండాళ్(గోదాదేవి)కి సంబంధించి ప్రముఖ గేయ రచయిత, కవి పేరరసు వైరముత్తు కు వ్యతిరేకంగా నమోదైన అన్ని కేసుల్లో పోలీసు విచారణపై స్టే ఇస్తూ శుక్రవారం మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
'ఆండాళ్'పై వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా తమిళనాడులో దుమారం రేపుతున్నాయి. ప్రముఖ గేయ రచయిత, కవి పేరరసు వైరముత్తు గోదాదేవిని కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఇటీవల శ్రీవిల్లిపుత్తూరులో జరిగిన ఓ సదస్సులో వైరముత్తు మాట్లాడుతూ, గోదాదేవి దేవదాసిగానే మృతి చెందిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై హిందుత్వవాదులు ధ్వజమెత్తారు.
ఆండాళ్ దేవి ఆలయానికి వచ్చి, ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు పెట్టారు. శుక్రవారం ఉదయం ఈ కేసు విచారణ హైకోర్టు ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా వైరముత్తు తరపు న్యాయవాది మాట్లాడుతూ, అమెరికా పరిశోధకుడి వ్యాసంలో గోదాదేవి దేవదాసిగానే చనిపోయిందంటూ పేర్కొనడాన్ని మాత్రమే వైరముత్తు ఉదహరించారని చెప్పారు.
ఈ వాదనతో ఏకీభవించిన జడ్జి... గోదాదేవిపై వైరముత్తు వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి కాదని, ఈ విషయంలో రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణపై స్టే ఇస్తున్నట్టు వెల్లడించారు. తదుపరి విచారణను ఫిబ్రవరికి 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు వైరముత్తు మాట్లాడుతూ.. తాను గోదాదేవిని కించపరచలేదని చెప్పారు. గోదాదేవిని తాను వేశ్యగా పేర్కొన్నట్టు విమర్శలు రావడం దారుణమని అన్నారు. ఎవరినైనా తాను బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. సదస్సులో గోదాదేవి వైభవం గురించి ముప్పావు గంటసేపు ప్రసంగించానని, అదే సమయంలో అమెరికా పరిశోధకుడు వెల్లడించిన వాటిని సభికుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.