ఉద్ధవ్..బీజేపీకి దగ్గరవుతున్నారా?: ఔరంగాబాద్, ఉస్మానాబాద్కు కొత్త పేర్లు ఇవే: షిండేకు చెక్?
ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం పతనం బల పరీక్షలను ఎదుర్కొనబోతోంది. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమికి ఒక్క రోజే గడువు మిగిలివుంది. బల నిరూపణ కోసం ప్రత్యేకంగా సభను సమావేశ పర్చాలంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. అసెంబ్లీ కార్యదర్శికి ఈ ఉదయం లేఖ రాశారు. గురువారం ఉదయం 11 గంటలకు సభ సమావేశ పర్చడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశించారు.
సుప్రీంకోర్టులో విచారణ వేళ..
గవర్నర్ రాసిన లేఖకు వ్యతిరేకంగా శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఉదయం ఆయన పిటీషన్ను దాఖలు చేశారు. శివసేన ఉద్ధవ్ వర్గం తరఫున ఈ పిటీషన్పై సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వీ తన వాదనలను వినిపిస్తోన్నారు. దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్పై విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.
మహా కేబినెట్ సంచలన నిర్ణయం..
ఈ పరిణామాల మధ్య మహారాష్ట్ర మంత్రివర్గం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారతీయ జనతా పార్టీకి దగ్గరవుతున్నామనే సందేశాన్ని పంపించినట్టయింది ఈ నిర్ణయంతో. ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్నాయి. దీని తరువాత తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే వైఖరి ఎలా ఉంటుందనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆ నగరాల పేర్లు మార్పు..
ఆ నిర్ణయాలే- రెండు ప్రధాన నగరాల పేర్లను మార్పు చేయడం. వాటికి కొత్త పేర్లు పెట్టడం. ఔరంగాబాద్ నగరం పేరును మార్చివేసింది మహారాష్ట్ర మంత్రివర్గం. దీనికి శంభాజీ నగర్గా నామకరణం చేసింది. అలాగే- ఉస్మానాబాద్ నగర పేరును కూడా తొలగించింది. దాని స్థానంలో ధారాశివ్ అనే పేరు పెట్టింది. ఈ రెండింటితో పాటు నవీ ముంబైలోని ఎయిర్పోర్ట్కు కూడా కొత్త పేరు పెట్టింది. దిగంబర్ బాపూజీ పవార్ పాటిల్ పేరు పెట్టింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రతిపాదనలను మహారాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.
డిమాండ్కు అనుకూలంగా..
దీనిపై త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను మార్చాలంటూ కొంతకాలంగా మహారాష్ట్రలో డిమాండ్ బలంగా ఉంది. వీటిని మార్చడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోండటం వల్లే ఉద్ధవ్ థాకరే నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారనే విమర్శలు సైతం చెలరేగాయి. బలపరీక్షలను ఎదుర్కొనడానికి ఒక్క రోజు ఉద్ధవ్ థాకరే.. వాటి పేర్లను మార్చడం చర్చనీయాంశమైంది.