మహా ట్విస్ట్: శరద్ పవార్ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడంతో రాజకీయాలు ఉత్కంఠగా మారిపోయాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే శదర్ పవార్ ఇంటికి రావడం కలకలం రేపింది. తాము బీజేపీకి బద్ద వ్యతిరేకులమని ఓ వైపు శరద్ పవార్ స్పష్టచేసిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఎంపీ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముంబైలోని సిల్వర్ ఓక్లో గల శరద్ పవార్ ఇంటికి బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే చేరుకున్నారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు. అజిత్ పవార్ వెన్నుపోటుతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న శరద్ పవార్ ఏం మాట్లాడుతారోనన్న ఆందోళన నెలకొంది. బీజేపీ విన్నపంపై శరద్ పవార్ ఏ విధంగా రియాక్ట్ అవుతారోనన్న అంశం ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ శరద్ పవార్ మనసు మారితే మాత్ర.. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి ఢోకా ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు అజిత్ పవార్పై శివసేన నేతలు మండిపడుతున్నారు. ఫడ్నవీస్ ఓ దొంగలాగా శనివారం ఉదయం ప్రమాణం చేశారని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ విమర్శించారు. అజిత్ పవార్కు ఎమ్మెల్యేల మద్దతు లేదని తేలిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితికి బీజేపీ-అజిత్ పవార్ కారణమని మండిపడ్డారు.
శనివారం ఉదయం ఫడ్నవీస్ సీఎం, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. బలబలాలపై పార్టీలు తెరచాటు రాజకీయాలు మొదలెట్టాయి. ఇప్పటికే ఆయా పార్టీలు క్యాంపులకు తరలించాయి.