దిగ్భ్రాంతిలో అదాని- ఆపన్నహస్తం అందిస్తామంటూ భరోసా
Mahakumbh 2025 stampede: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
40 మందికి పైగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు.

త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక్కడి ఘాట్ల వద్దకు వెళ్లే మార్గం మొత్తం భీతావహంగా కనిపించింది. బ్యారికేడ్లన్నీ ఎక్కడికక్కడ పడిపోయి కనిపించాయి. తొక్కిసలాట చోటు చేసుకున్న వెంటనే అధికార యంత్రాంగం శరవేగంగా స్పందించింది. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్సుల్లో మోతీలాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించింది.
ఈ ఘటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. త్రివేణి సంగమం నోస్ పాయింట్ వద్ద అమృత్, పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లే ప్రయత్నం చేయొద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇతర ఘాట్ల వద్ద స్నానం ఆచరించడానికి అనువైన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.
ఈ ఘటన పట్ల అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. యోగి ఆదిత్యనాథ్తో నాలుగుసార్లు ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు.
महाकुंभ में घटी हृदयविदारक घटना से हम अत्यंत व्यथित है।
— Gautam Adani (@gautam_adani) January 29, 2025
हम दिवंगत आत्माओं को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करते हैं और शोक संतप्त परिवारों के प्रति गहरी संवेदना प्रकट करते हैं।
महाकुंभ में उपस्थित अदाणी परिवार के सभी सदस्य और संपूर्ण अदाणी समूह मेला प्रशासन व राज्य सरकार के…
తొక్కిసలాట పట్ల దేశీయ పారిశ్రామిక దిగ్గజం, అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. అత్యంత విషాదకరమైన, హృదయవిదారక ఘటనగా అభివర్ణించారు. మృతులకు శ్రద్ధాంజలి అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు అదాని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
క్షతగాత్రులు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి మహా కుంభమేళాలో భక్తులు, యాత్రీకుల సేవలో ఇప్పటికే పాల్గొంటోన్న అదాని కుటుంబీకులు, అదాని గ్రూప్ సంస్థల ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో కలిసి పని చేస్తారని ఆయన వెల్లడించారు. తొక్కిసలాట బారినపడ్డ వాళ్ల కుటుంబాలకు వీలైనంత వరకు సహాయ, సహకారాలను అందిస్తామని భరోసా ఇఛ్చారు.












Click it and Unblock the Notifications