దారుణం : పదేళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్దుడి అత్యాచారం... చాక్లెట్,డబ్బు ఆశజూపి...
మహారాష్ట్రలో దారుణం జరిగింది. పదేళ్ల ఓ బాలికపై 68 ఏళ్ల వృద్దుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు చాక్లెట్,డబ్బు ఆశజూపి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై... ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. సోమవారం(మార్చి 28) పింప్రి చించ్వాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... పింప్రి చించ్వాడ్ పట్టణంలోని ఓ మురికివాడలో ఓ పేద దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమార్తె ఉంది. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తుండగా... ఆ బాలిక ఇంటి పట్టునే ఉంటోంది. ఎప్పటిలాగే సోమవారం(మార్చి 29) బాలిక తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లగా... ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది.

ఇదే క్రమంలో సావన్ డోలస్ అనే(68) అనే వ్యక్తి ఏదో పని నిమిత్తం సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో ఆ మురికివాడకు వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటం గమనించాడు. ఆమె ఇంటి వద్దకు వెళ్లి మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. ఆమెకు చాక్లెట్,డబ్బు ఆశజూపి తనతో రావాలని కోరాడు. మాయ మాటలు నమ్మి బాలిక అతని వెంట వెళ్లింది. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
ఇంతలో అటుగా వెళ్తున్న బాలిక బంధువు ఆమెను గమనించాడు.బాలికను వెంటపెట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లాక బాలిక తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆమెను ఆరా తీశారు. తనపై అత్యాచారం జరిగిందని బాలిక చెప్పడంతో షాక్ తిన్నారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications