మహారాష్ట్రలో తగ్గుతున్న కరోనా- ఐదంచెల అన్లాక్ ప్రకటన, ముంబై ట్రైన్లు మాత్రం ఆలస్యం
దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ప్రధాన రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీంతో తిరిగి లాక్డౌన్ నుంచి అన్లాక్కు వెళ్లేందుకు ఆయా రాష్టాలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే సర్కారు అన్లాక్ ప్రకటన చేసింది.
మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఐదు అంచెల అన్లాక్ ప్రక్రియను అమలు చేయాలని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా క్రమంగా ఒక్కోరంగంలో అన్లాక్ అమలు చేస్తారు. గతేడాది కరోనా తర్వాత కేంద్రం అమమలు చేసిన తరహాలోనే ఈ అన్లాక్ ప్రక్రియ ఉండబోతోంది. తొలి దశలో థానేతో పాటు 18 జిల్లాల్లో ఆంక్షలు సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దశలో మిగిలిన జిల్లాల్లో ఆంక్షల్ని సడలిస్తారు.
అయితే దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మాత్రం ఆంక్షల్ని పూర్తిగా సడలించరాదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ముంబైలో సిటీ సబర్బన్ ట్రైన్లు, మెట్రో రైళ్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. తర్వాతి దశల్లో ముంబైలో రవాణా వ్యవస్ధపై ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే వాణిజ్య కార్యకలాపాలు అధికంగా ఉండే ముంబైలో సిటీ సబర్బన్, మెట్రో రైళ్ల కోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగని వీటికి అనుమతిస్తే తిరిగి తక్కువ సమయంలోనే కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.