కష్ట కాలంలో ఆదుకున్నందుకు... సీఎం జగన్కు మహారాష్ట్ర నెటిజన్ల కృతజ్ఞతలు...
విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ నుంచి మహారాష్ట్రకు ఇటీవల 300 వెంటిలేటర్లను సరఫరా చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ఈ సాయానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇదివరకే కృతజ్ఞతలు తెలిపారు. కష్ట కాలంలో తమను ఆదుకున్నందుకు మహారాష్ట్ర నెటిజన్లు కూడా సీఎం జగన్కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెబుతున్నారు. సకాలంలో వెంటిలేటర్లు పంపించి ఎంతోమంది ప్రాణాలు నిలిపినందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.
Thank you so much. Ys jagan mohan Reddy sir,Hon. Chief Minister of Andhra pradesh. @ysjagan
— Dr.Sanjay Sonawane.डाॅ.संजय सोनावणे. (@DrSanjayspeaks) April 24, 2021
ప్రస్తుతం దేశంలోనే అత్యధిక కేసులు,మరణాలు మహారాష్ట్రలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. పేషెంట్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో చాలా ఆస్పత్రులు ఆక్సిజన్ కొరత,వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సాయం కోరారు. ఏపీ నుంచి వెంటిలేటర్లు పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.సానుకూలంగా స్పందించి సీఎం జగన్ వెంటనే మహారాష్ట్రకు 300 వెంటిలేటర్లు పంపించారు. అడిగిన వెంటనే సాయం చేసినందుకు నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు.
గడ్కరీ చేసిన ట్వీట్పై మహారాష్ట్రకు చెందిన చాలామంది నెటిజన్లు స్పందిస్తున్నారు. కష్ట కాలంలో వెంటిలేటర్లు పంపించి ఆదుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను రైలు ద్వారా మహారాష్ట్రకు తరలించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయించిన స్టీల్ ప్లాంట్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఎంతో కీలకంగా మారడం చర్చనీయాంశంగా మారింది.
Thank You So Much @ysjagan sir For Helping Maharashtra.. Around 300 Ventilator from Andhra Pradesh.. #ThankYouYSJagan #AndhraPradesh #MVA #MaharashtraGovernment
— Prabhat SS Kuchik (@prabhatkuchik) April 23, 2021
విశాఖ స్టీల్ ప్లాంట్ తమ అవసరాల కోసం చాలా ఏళ్ల క్రితమే సొంత ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంది. ప్లాంట్ అవసరాల కోసం రోజూ 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ప్రస్తుత మెడికల్ అవసరాల రీత్యా ఉత్పత్తిని పెంచారు. ఇక్కడినుంచి తెలంగాణ,ఒడిశా,మహారాష్ట్రలకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం 8,842 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ సరఫరా చేసింది. దేశంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లల్లో మొత్తం 28 మేజర్ స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజూ 1500 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తాయని అంచనా వేస్తున్నారు.