కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా గానీ: ముఖ్యమంత్రి భార్యకు సోకిన వైరస్: ఆసుపత్రిలో
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ కల్లోలాన్ని కొనసాగిస్తూనే ఉంది. కొద్దిరోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం 27,918 కేసులు రికార్డయ్యాయి. 139 మంది మరణించారు. 3,40,542 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మీ థాకరే కరోనా వైరస్ బారిన పడ్డారంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనారోగ్యానికి గురైన ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ల వెల్లడించారు.
శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నాకు ఆమె ఎడిటర్గా వ్యవహరిస్తున్న రష్మీ థాకరే ఈ నెల 23వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటి నుంచి హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమించింది. వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో నీరసానికి గురయ్యారు. దీనితో ఆమెను మంగళవారం రాత్రి హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమ కుమారుడు, మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరేకు కూడా కరోనా వైరస్ సోకింది. ఆయన కోలుకుంటున్నందున.. హోమ్ క్వారంటైన్లోనే కొనసాగుతున్నారు.
ఈ నెల 11వ తేదీన రష్మీ థాకరే కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ముంబైలోని ప్రభుత్వ జేజే ఆసుపత్రిలో మొదటి డోసు టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న సరిగ్గా 11వ రోజే రష్మీ థాకరే కరోనా వైరస్ బారిన పడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యాక్సిన్ వేసుకున్న తరువాత.. ఆమెకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదంటూ మొదట వెల్లడించారు. అదే సమయంలో వైరస్ సోకడం కలకలం రేపుతోంది. వ్యాక్సిన్ వేయడానికి ముందే కరోనా సోకి ఉండొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుతం రష్మీ థాకరే ఆరోగ్యం బాగుందని, నీరసంగా ఉండటం వల్ల డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు అధికారులు తెలిపారు.