నేటి రాత్రి నుంచే నైట్ కర్ఫ్యూ, భారీగా జరిమానాలు అమల్లోకి: ముంబైలో కొత్త కరోనా కేసుల రికార్డ్
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరోసారి 35వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా భారీగానే సంభవించాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది.
మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం
మహారాష్ట్రలో శనివారం కొత్తగా 35,726 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 14,523 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 166 మంది కరోనా బారినపడి మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26,73,461కు చేరింది. రికవరీల సంఖ్య 23,14,579కి చేరింది. మరణాల సంఖ్య 54,073కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,03,475 యాక్టివ్ కేసులున్నాయి.
ముంబైలో కరోనా కొత్త రికార్డులు
ఇక మహారాష్ట్ర రాజధాని ముంబైలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 6,130 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ నగరంలో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న క్రమంలో శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నారు. మాల్స్, థియేటర్లు, హాల్స్, ఆడిటోరియంలు రాత్రి 8 గంటల వరకు మూసివేయాల్సిందే.
నేటి రాత్రి నుంచే నైట్ కర్ఫ్యూ.. భారీ జరిమానాలు
మిషన్ బిగిన్ ఆగేన్ పేరుతో కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నేటి రాత్రి నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
1. బహిరంగ, పని ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి.
2. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలి. కనీసం 6 ఫీట్లు
3. సినిమా హాల్స్, మాల్స్, ఆడిటోరింయలు, రెస్టారెంట్లు రాత్రి 8గంటలకే మూసివేయాలి, ఉదయం 7 గంటల వరకు. అయితే, హోం డెలివరీకి అనుమతి ఉంది. కర్ఫ్యూ రాత్రిపూట కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు.
నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా, మాస్కు లేకుంటే రూ. 500
4. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే ప్రాంతాన్ని బట్టి జరిమానాలు
5. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, టొబాకో నమలడం నిషేధం.
6. కంపెనీలు వీలైతే 'వర్క్ ఫ్రం హోం' చేయించాలి.
7. సాధారణ ప్రాంతాల్లో ప్రవేశం, ముగింపు ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ వాష్, శానిటైజర్లను తప్పకుండా ఉంచాలి.
8. పని ప్రాంతాల్లో తరచూ శానిటైజ్ చేయాలి.
9. ఉద్యోగులు భౌతిక దూరం పాటించాలా సంస్థలు ఏర్పాట్లు చేయాలి.
10. అన్ని ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలి. ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు ఈ నిబంధనలేవీ వర్తించవు.
11. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాల్లో గుడిగూడటం నిషేదం.