10వేలు-50వేల జరిమానా: మహారాష్ట్రలో మరింత కఠినంగా ఆంక్షలు, సర్కారు హెచ్చరికలు
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అమలులో ఉన్న నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ తోపాటు 'బ్రేక్ ది చైన్' పేరిట మరిన్ని కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

నిబంధనలు అతిక్రమిస్తే రూ. 50వేల జరిమానా
ఏప్రిల్ 22 గురువారం రాత్రి 8 గంటల నుంచి మే 1 వరకు కొత్తగా ప్రకటించిన ఆంక్షలు అమలులో ఉంటాయని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ప్రైవేటు, ప్రభుత్వ(కేంద్ర/రాష్ట్ర) కార్యాలయాల్లో 15 శాతం హాజరుతో పనిచేసేందుకు అవకాశం కల్పించింది. వివాహాలు వంటి శుభాకార్యాల్లో 25 మందికి మించరాదని స్పష్టం చేసింది. అంతేగాక, ఒకే హాలులో రెండు గంటలకు మించకుండా ఈ శుభ కార్యాన్ని పూర్తి చేసుకోవాలని, నిబంధనలను అతిక్రమిస్తే రూ. 50వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

10 వేల జరిమానా, లైసెన్సులు రద్దంటూ హెచ్చరిక
ప్రైవేటు వాహనాలను అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతిస్తామని, అది కూడా డ్రైవర్ తోపాటు 50 శాతం ప్రయాణికుల సామర్థ్యం మించరాదని తేల్చి చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లోనే నగరాల మధ్య, జిల్లా మధ్య ప్రైవేటు వాహనాలకు అనుమతిస్తామని తెలిపింది. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే రూ. 10 వేల జరిమానా తోపాటు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇక ప్రైవేటు బస్సులు 50 శాతం సామర్థ్యంతో నడిపించేందుకు అవకాశం కల్పించింది. నగరాల మధ్య జిల్లాల మధ్య ప్రయాణాలపైనా నియంత్రణ ఉంటుందని తెలిపింది. నగరంలో రెండు స్టాప్ ల కన్నా మించి బస్సుల్ని ఆపరాదని సర్వీస్ ఆపరేటర్లను ఆదేశించినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మహారాష్ట్రలో 7 లక్షలకు చేరువలో యాక్టివ్ కేసులు
కాగా, మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు మరింతగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 568 మంది మరణించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఇవే అత్యధికంగా కావడం గమనార్హం. అంతేగాక, ఒక్క రోజు వ్యవధిలో 67,468 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇవే అత్యధికం కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 6,95,747కు యాక్టివ్ కేసులు పెరిగాయి. మహారాష్ట్రలోని ముఖ్య నగరాల్లోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో పుణెలో కొత్తగా 10,852 కరోనా కేసులు, 35 మంది మరణించారు. ముంబై నగరంలో 7684 కరోనా కేసులు నమోదు కాగా, 62 మంది మరణించారు. నాగ్పూర్లో 7555 కేసులు నమోదు కాగా, 41 మంది మరణించారు. నాసిక్లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన ప్రమాదంలో 24 మంది రోగులు మృతి చెందారు. ఈ నగరంలో 6703 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు.












Click it and Unblock the Notifications