ఉద్ధవ్ థాక్రే ఇంటికి శరద్ పవార్, ఎన్సీపీ నేతలు: తాజా పరిస్థితిపై కీలక చర్చ
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సాంలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు మకాం వేయగా.. శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే వారిని తిరిగి రప్పించేందుకు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏం చేయాలో పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు. తాజాగా, ఉద్ధవ్ థాక్రేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు.
థాక్రే నివాసం మాతోశ్రీకి వచ్చిన పవార్ తోపాటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్, రాష్ట్రమంత్రి జయంత్ పాటిల్, ఎన్సీపీ నేత ప్రపుల్ పటేల్ తాజా పరిణామాలపై కీలకంగా చర్చించారు. ఇప్పటికే 50 మంది సభ్యుల బలమున్న తమదే అసలైన శివసేన అంటూ రెబల్ నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది శివసేన. అయితే, ఆ పరిస్థితులకు అవకాశం ఉందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
తదుపరి కార్యాచరణ ఎలా ఉంటే ప్రభుత్వం నిలబడే పరిస్థితులు ఏర్పడవచ్చనే అంశంపై శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే తమ పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. పార్టీని ముక్కలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఉద్ధవ్ వారితో అన్నారు. శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు.. ఇప్పుడు పార్టీని విడిచి పారిపోయారన్నారు. శివసేన, థాక్రే పేర్లు వాడకుండా వారెలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు. తానెప్పుడూ సీఎం పదవి గురించి ఆలోచించలేదన్నారు.
ఇది ఇలావుండగా, మహారాష్ట్ర వ్యాప్తంగా రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన కార్యకర్తలు దాడులు చేస్తున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు ఫెక్సీలు, బ్యానర్లను చించేసి, ద్వంసం చేస్తున్నారు. అయితే, తామే అసలైన శివసేన నాయకులమని రెబల్ నేతలు అంటున్నారు. తాము బాలా సాహెబ్ బాటలోనే నడుస్తున్నామన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి బయటకువచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రెబల్ నేత ఏక్నాథ్ సింగ్ ఇప్పటికే ఉద్ధవ్ కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.