రాడిసన్ బ్లూ హోటల్లో 20 గదులు బుక్: గువాహటికి ఉద్ధవ్ వర్గ నేతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం అస్సాంకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే మకాం వేసిన గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్ కేంద్రబిందువుగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ముఖ్య నాయకులు, కొందరు మంత్రులు సైతం వారికి అండగా ఉంటోన్నారు. ఎప్పటికప్పుడు మంతనాలు సాగిస్తోన్నారు.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి భాగస్వామ్య పార్టీలు శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ ఎమ్మెల్యేలతో క్యాంప్ రాజకీయాలు చేస్తోన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ఏక్నాథ్ షిండే వైపు మొగ్గు చూపకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా ఉంచారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నారు. కొందరు ఫోన్ కాల్స్ను ట్యాప్ చేస్తోన్నారంటూ ఏక్నాథ్ షిండే వర్గ నేతలు ఆరోపిస్తోన్నారు.
ఈ పరిణామాల మధ్య- ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన సీనియర్ నాయకులు గువాహటికి వెళ్లాలని నిర్ణయించారు. ఏక్నాథ్ షిండే క్యాంప్ వేసిన రాడిసన్ బ్లూ హోటల్లోనే మకాం వేయనున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో కొన్ని గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. 20 గదులను బుక్ చేయాలంటూ ఉద్ధవ్ థాకరే వర్గ సీనియర్ నాయకులు రాడిసన్ బ్లూ హోటల్ సిబ్బందికి ఇమెయిల్ పంపించినట్లు తెలుస్తోంది.
గదుల బుకింగ్ ఖరారైన వెంటనే వారంతా గువాహటికి వెళ్లేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారంటూ వార్తలు వస్తోన్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. తమను బలవంతంగా మొదట గుజరాత్లోని సూరత్.. అనంతరం గువాహటికి తరలించినట్లు ఇద్దరు ఏక్నాథ్ షిండే వర్గ శాసనసభ్యులు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ వర్గ నేతలు తమ మకాంను రాడిసన్ బ్లూ హోటల్కు మార్చాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.
నేరుగా వారు ఉంటోన్న హోటల్లోనే మకాం వేయడం ద్వారా ఎంతమంది ఏక్నాథ్ షిండేకు మద్దతు ప్రకటించారనేది తేలిపోతుందని అంచనా వేస్తోన్నారు. గువాహటికి వెళ్లే వారిలో రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్తో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉద్ధవ్ వర్గానికి చెందిన సీనియర్ నేత ఒకరు ధృవీకరించారు. గదులు బుక్ అయినట్లు సమాచారం అందిన వెంటనే గువాహటికి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని చెప్పారు.