పూణే అల్లర్ల నిందితుడిని ‘పద్మశ్రీ’కి సిఫారసు! మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం..
ముంబై: భీమా-కొరెగావ్ అల్లర్ల కేసులో నిందితుడైన.. సంగిలికి చెందిన రైట్ వింగ్ నేత మనోహర్ అలియాస్ శంభాజీ భిడేను మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డుకు సిఫారసు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది.
పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ భిడేను 'పద్మశ్రీ' అవార్డు కోసం సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన పత్రాలు ఇంకా ప్రభుత్వం వద్దకు చేరుకోలేదు.
శంభాజీ భిడే(84) అలియాస్ భిడే గురూజీ ఆదినుంచీ వివాదాస్పద నేత. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడేతోపాటు రైట్ వింగ్కు చెందిన మరో నేత మిలింద్ ఎక్బోటేపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది.
మళ్లీ సుప్రీంకోర్టు కొలీజియం వర్సెస్ మోడీ సర్కార్! ఇద్దరు జడ్జిల నియామకంలో కేంద్రం అభ్యంతరం!?
అంతేకాదు, సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ శంభాజీ భిడేపై మరో కేసు కూడా ఉంది. అలాగే 2008లో 'జోధా-అక్బర్' సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్న కేసు కూడా అతడిపై నమోదైంది.
ఇన్ని కేసులు ఉన్న ఓ నిందితుడిని 'పద్మశ్రీ' పౌర పురస్కారానికి మహారాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పద్మ పురస్కారాలకు వ్యక్తుల ఎంపికలో జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.