మహారాష్ట్రలో కరోనా బీభత్సం .. తాజా కేసులు 16,620 , ఈ ఏడాది రోజువారీ కేసులలో అత్యధికం ఇదే
మహారాష్ట్రలో కరోనా కేసులు ఉదృతంగా పెరుగుతున్నాయి. మరోమారు మహారాష్ట్ర కరోనా మహమ్మారి తో విలవిలలాడుతోంది. మహారాష్ట్రలో ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా అత్యధికంగా 16,620 కొత్త కరోనా కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసులు 23,14,413 కు చేరింది.

తాజాగా 16 వేల మార్కు దాటిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 50 మంది కరోనా బారిన పడిన వారు మరణించగా , మొత్తం మరణాల సంఖ్య 52,861 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్రలో గత రెండు రోజుల్లో, రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 15,000 పైన నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆదివారం 16,000 మార్కును దాటింది. నిన్న ఒక రోజులో 8,861 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,34,072 కు పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,26,231
రాష్ట్రంలోని కోవిడ్-19 రికవరీ రేటు 92.21 శాతం, మరణాల రేటు 2.28 శాతంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,26,231 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుతం కరోనా బారినపడిన 5,83,713 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా, 5,493 మంది క్వారంటైన్ అయ్యారు. ఆదివారం 1,08,381 మందిని పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,75,16,885 కు చేరింది.

ముంబై , పూణే , నాగ్పూర్ లలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ముంబై నగరంలో కొత్తగా 1,963, పూణే నగరం లో 1,780 కేసులు, ఔరంగాబాద్ నగరంలో 752, నాందేడ్ లో 351, పింప్రి చిన్చ్వాడ్ లో 806 కేసులు, అమరావతి లో 209, నాగ్పూర్లో 1,976 కేసులు నమోదయ్యాయి.
అంతేకాదు అహ్మద్నగర్ లో 151, జల్గావ్ సిటీ 246, నాసిక్ సిటీ 946 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా కేసులో అదుపులోకి రాకుండా నిత్యం పెరుగుతుండటంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు .

నిబంధనలు పాటించకుంటే కఠిన లాక్ డౌన్ దిశగా మహా సర్కార్ నిర్ణయం
కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోతే మరొకసారి లాక్ డౌన్ విధిస్తామని, కఠినమైన లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి అదుపు తప్పుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు . కరోనా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోకుండా ఉండేలా ప్రజల సహకారం ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications