మహారాష్ట్రలో రికార్డులు బద్దలు కొడుతున్న కరోనా: ఒక్కరోజులోనే 36వేలకు చేరువలో, ముంబైలోనూ కల్లోలం
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత రికార్డులు బద్దలవుతున్నాయి. తాజాగా, గురువారం ఒక్కరోజే దాదాపు 36వేల కొత్త కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా మొదలైన నాటి నుంచి ఈ స్థాయిలో కరోనా కేసులు పెరగలేదు.
మహారాష్ట్రలో కరోనా కల్లోలం..
గత 24 గంటల్లో 35,952 కొత్త కరోనా కేసులు నమోదు కాగా, 111 మంది కరోనాతో మరణించారు. అదే సమయంలో 20,444 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1,88,78,754 కరోనా నమూనానలు పరీక్షించగా, 26,00,833 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వీరిలో 22,83,037 మంది కోలుకున్నారు. 53,795 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,62,685 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలోని యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే సగానికిపైగా ఉండటం గమనార్హం.
ముంబైలోనూ రికార్డుస్థాయిలో కరోనా కేసులు
ఇక మహారాష్ట్రలోని నగరాల్లోనూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముంబై నగరంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5504 పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదైనట్లు బీఎంసీ వెల్లడించింది. కరోనా ప్రారంభమైననాటి నుంచి ఒక్కరోజే ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి పట్టే సమయం 75 రోజులకు తగ్డడం ఆందోళనకర విషయమని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర నగరాల్లోనూ భారీగా యాక్టివ్ కేసులు
దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ప్రస్తుతం ముంబైలో 32,529 యాక్టివ్ ఉండగా, థానేలో 25,130, పుణెలో 50,240, నాసిక్లో 18,176, నాగ్పూర్లో 35,795, నాందేడ్లో 12,272, ఔరంగాబాద్లో 17,411, జల్గావ్లో 6,146, అకోలాలో 4,699, అహ్మద్ నగర్లో 5946 చొప్పున కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో రోజు నమోదవుతున్న మొత్తం కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువ ఒక్క మహారాష్ట్రలోనే బయటపడుతుండటం గమనార్హం. బుధవారం దేశ వ్యాప్తంగా 53వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క మహారాష్ట్రలోనే 31వేలకు పైగా కేసులున్నాయి.