మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా కల్లోలం: దేశ రాజధానిలో రోగుల పరిస్థితి దయనీయం
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. కొత్త కేసులతోపాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో సగం కేసులు ఈ రాష్ట్రంలోనే వెలుగుచూస్తుండటం గమనార్హం.
గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 61,695 కొత్త కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి. తాజాగా, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మహారాష్ట్రలో 2.30 కోట్ల మందికిపైగా నమూనాలను పరీక్షించగా.. 36,39,855 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో 29,59,056 మంది కోలుకున్నారు. మరో 59,153 మంది కరోనా బారినపడి ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 6,20,060 యాక్టివ్ కేసులున్నాయి.

మరోవైపు దేశ రాజధానిలోనూ కరోనా కల్లోలం సృష్టిస్తోంది. భారీ ఎత్తున కరోనా రోగులు ఆస్పత్రులకు వస్తుండటంతో వారికి అక్కడ బెడ్ల కొరత ఏర్పడుతోంది. దీంతో కరోనా రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని ఆస్పత్రుల్లో ఒకే పడకపై ఇద్దరు రోగులకు ఉంచి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న దృశ్యాలు ఈ మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిస్థితులకు అద్దంపడుతున్నాయి.
కాగా, గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో మరో 16వేలకుపైగా కొత్త కేసులు రావడం మరింత కలవరపెడుతోంది. గత 24 గంటల్లో దేశ రాజధాని నగరంలో 82,569 కరోనా నమూనాలను పరీక్షించగా.. 16,699 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 112 మంది మరణించారు. తాజాగా, 13,014 మంది కోలుకున్నారు. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,84,137కి పెరిగింది. వీరిలో 7,18,176 మంది కోలుకోగా, 11,652 మంది మరణించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 54,309 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications