వరద బాధితుల కోసం నిధుల సేకరించిన సెక్స్ వర్కర్లు
న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టించడంతో లక్షలాది మంది నిరాశ్రయులైన వార్తలు మహరాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో నివసిస్తున్న సెక్స్ వర్కర్లను కదిలించాయి. దీంతో ఈ సెక్స్ వర్కర్లు తమ స్దాయికి తగిన విధంగా నిధులు సేకరించారు. వ్యభిచారం చేసినందుకు గాను వారికి వచ్చే మొత్తంలో నుంచి కొంత డబ్బుని నిధికి విరాళంగా అందించారు.
రూ. 10,321 సేకరించి, ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి చేర్చాలంటూ, అహ్మద్ నగర్ డిప్యూటీ కలెక్టర్ రాజేంద్ర కుమార్ పాటిల్కు 'స్నేహాలయ' ఎన్జీవో ట్రస్టీ సుమన్ త్రిభువన్ ద్వారా శుక్రవారం అప్పగించారు.
సుమన్ మాట్లాడుతూ గత 25ఏళ్లగా ఇక్కడి సెక్స్ వర్కర్లు దేశంలో ఎక్కడ విపత్తు సంభవించినా.. తమ వంతు సాయం అందిస్తారని అన్నారు. 1993లో ముంబయి వరుస పేలుళ్ళు, 2001లో గుజరాత్ భూకంపం, కార్గిల్ యుద్ధం, సునామీ, మహారాష్ట్రలో కరవు, గతఏడాది ఉత్తరాఖండ్లో వరదలకు.. ఇలా అన్ని సమయాల్లో తమ ఉదారతను చాటుకున్నారని అన్నారు.
గతేడాది సంభవించిన ఉత్తరాఖండ్ వరదల సందర్భంగా వీరు లక్ష రూపాయల నిధులను అందించారని సుమన్ తెలిపారు. వారు తమ హక్కుల కోసం పోరాడడమే గాకుండా, ఇతరులకు కలిగే కష్టనష్టాలపైనా స్పందిస్తారని ఆమె పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల కోసం సుమారు 200 మంది సెక్స్ వర్కర్లు ఈ నిధుల సమీకరణలో పాల్గొన్నారు.