ఫేర్వెల్ పార్టీలో మాట్లాడుతూ కుప్పకూలి విద్యార్థిని మృతి
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. పెద్దవారే కాకుండా యువతీయువకులు కూడా గుండెపోటుకు గురై క్షణాల్లోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా, ఓ కాలేజీ ఫేర్వెల్ ఈవెంట్లో ఓ విద్యార్థిని మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలోని ఓ కాలేజీ యాజమాన్యం ఇటీవల ఫేర్వెల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో పాల్గొన్న 20 ఏళ్ల విద్యార్థిని వేదికపై మాట్లాడుతూ.. కాలేజీలో తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. అంతేగాక, తన మాటలతో అక్కడున్నవారిని సరదాగా నవ్వించింది. అయితే, మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందపడిపోయింది.

వెంటనే అప్రమత్తమైన అక్కడున్నవారు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు. విద్యార్థిని గుండెపోటు కారణంగానే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. విద్యార్థిని కుప్పకూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, ఎనిమిదేళ్ల వయస్సులో సదరు విద్యార్థినికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిందని.. ఇన్నేళ్లపాటు ఆరోగ్యంగానే ఉందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ గుండెపోటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లతో చిన్న వయస్సులోనే యువత గుండెపోటు బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ యువతి పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ .. ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. గుండెపోటు కారణంగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటుండటం గమనార్హం. మూడు రోజుల క్రితం ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలి మృతి చెందాడు. కొందరు మాట్లాడుతుండగానే.. మరికొందరు జిమ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications