కదులుతున్న రైల్లోంచి మహిళను తోసి చంపేశాడు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. కదులుతున్న రైల్లోంచి టికెట్ కలెక్టర్ ఓ మహిళను కిందికి తోసేశాడు. దీంతో ఆమె మృత్యువాత పడింది. జనతా ఎక్స్ప్రెస్ రైల్లో మహారాష్ట్రలోని జలగావ్ సమీపంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఓ మహిళ జనరల్ కోచ్ టికెట్తో ఎసి కోచ్లోకి ప్రవేశిస్తుండగా టికెట్ కలెక్టర్ బయటకు తోసేశాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తీవ్ర గాయాలతో ఆమె సంఘటనా స్థలంలోనే మరణించింది. టికెట్ కలెక్టర్ మద్యం సేవించి ఉన్నట్లు మృతురాలి బంధువులు ఆరోపించారు. టీసీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతురాలు ఉజ్వల పాండే (38) బంధవు రాహుల్ పురోహిత్ ప్రభుత్వ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ను సంపత్ సాలుంఖేగా గుర్తించారు. అతను ముంబై ప్రధాన కార్యాలయంలో పనిచేస్తాడు.
రైలు కదులుతుండడంతో హడావిడిగా ఉజ్వల పాండే ఎసి కోచ్లోకి ఎక్కింది. ఉజ్వల పాండే టిసి తోసేయడంతో నియంత్రణ కోల్పోయి కోచ్కు, ప్లాట్పారం మధ్య పడిపోయింది. ఆమెపై నుంచి రైలు వెళ్లిపోయింది.