అయోధ్య రామమందిరానికి రూ. 10 కోట్ల విరాళం: ఎవరిచ్చారంటే..?
న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ నిర్మాణం కోసం పలువురు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా, బీహార్ రాజధాని పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ పాలక మండలి భారీ విరాళాన్ని ప్రకటించింది.

రామ మందిరానికి రూ. 10 కోట్ల విరాళం
అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ. 10 కోట్ల విరాళాన్ని ఇస్తున్నట్లు మహావీర్ ఆలయ పాలక మండలి వెల్లడించింది. అందులో భాగంగా తొలుత రూ. 2 కోట్లను చెక్కు రూపంలో అందజేయనున్నట్లు తెలిపింది. మిగిలిన మొత్తాన్న దశల వారీగా మందిర నిర్మాణ ట్రస్టుకు అందజేస్తామని పేర్కొంది.

సీతారాముల నాణేలు..
రామ మందిర నిర్మాణానికి తాము ఏర్పాటు చేసిన విరాళాల పెట్టెలో అణాపైస విలువ చే ముప్పై నాణేలను భక్తులు వేశారని మహావీర్ ఆలయ పాలక మండలి తెలిపింది. ఈ నాణేలపై సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు వెల్లడించింది. ఈ పురాతన నాణేలను ఈస్ట్ ఇండియా కంపెనీ 1818లో ముద్రించినవని మహావీర్ ట్రస్ట్ సెక్రటరీ కిషోర్ కూనల్ తెలిపారు.

మొదటి విరాళం కేంద్రం రూ. 1..
కాగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1 రూపాయి మొదటి విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డీ ముర్ము ప్రభుత్వం తరపున ట్రస్ట్ సభ్యులకు అందజేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర' పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫిబ్రవరి 5న పార్లమెంటులో ప్రకటించిన విషయం తెలిసిందే.

15మంది సభ్యులతో ఆలయ నిర్మాణ ట్రస్ట్..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఆలయ నిర్మాణంలో అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారు. వారిలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారై ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ట్రస్టుకు ప్రముఖ న్యాయ కోవిదుడు పరాశరన్ ఛైర్మన్గా నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications