ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. అగ్నికి ఆహుతైన 100 గుడిసెలు
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. 100 గుడిసెల వరకు దగ్ధమయ్యాయి. వెస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. కీర్తి నగర్ లోని ఫర్నీచర్ షాపులో చెలరేగిన మంటలు క్షణాల్లో దావానంలా వ్యాపించాయి. దీంతో ఎగిసిపడ్డ అగ్నికీలలు పక్కనే ఉన్న మురికివాడకు వ్యాపించాయి. దీంతో పేదలు నివాసముండే గుడిసెలు, ఇళ్లు వంద వరకు కాలి బూడిదయ్యాయి. దీంతో అందులో నివసిస్తున్నవారు నిరాశ్రయులయ్యారు.
కీర్తినగర్ లోని ఓ పెద్ద ఫర్నీచర్ షాపులో మంటలు చెలరేగాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పై అంతస్తులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దాదాపు 30 అగ్నిమాపక యంత్రాలు నిరంతరాయంగా పనిచేయడంతో శుక్రవారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఇద్దిరికి స్వల్ప గాయాలయ్యాయి. షార్ట్ సర్క్యూటా లేదంటే నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయా అనే విషయాలు తెలియరాలేదు.