కోల్కత్తా చేపలబజార్లో భారీ అగ్నిప్రమాదం, జార్ఖండ్లో బాంబు పేలుడు
కోల్కత్తా: కోల్కత్తాలోని అతి పురాతనమైన చేపల బజార్లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
150 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ చేపల మార్కెట్లో మంటలను ఆర్పేందుకు సహాయక చర్యల్లో 20 అగ్నిమాపక శకటాలు పాల్గొన్నాయి. చేపల బజార్లో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలుసుకున్న కోల్కతా నగర మేయర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
జార్ఖండ్లో బాంబు పేలి ఇద్దరికి గాయాలు
జార్ఖండ్లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో బాంబు పేలి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జార్ఖండ్లోని ఛత్రాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఛత్రాలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
అదే బిల్డింగ్లో మరో ఏడు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సురేంద్రకుమార్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బిల్డింగ్ యజమానిని, అతని కుమారుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.