భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు!
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 ఎత్తివేత, కేంద్ర పాలిత ప్రాంతాల ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వం తీరిక లేకుండా గడుపుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో గప్ చుప్ గా సరిహద్దులను దాటి భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చారు ఉగ్రవాదులు. పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సుమారు అర కిలోమీటర్ మేర అక్రమంగా చొరబడ్డ ఉగ్రవాదులు సరిహద్దుల్లో పహారా కాస్తోన్న భారత జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. దీనికి ప్రతిగా భారత జవాన్లు ఎదురు కాల్పులు చేపట్టారు. వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడంతో వెనక్కి పరారయ్యారు.
కాశ్మీర్ విభజన: ఒక వైపే చూస్తున్నారెందుకు?: రాహుల్ గాంధీ
జమ్మూ కాశ్మీర్ లోని మచ్చల్ సెక్టార్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చొరబాటు ఉదంతాన్ని భారత సైన్యాధికారులు ధృవీకరించారు. మచ్చల్ సెక్టార్ సమీపంలో అయిదారు మంది గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ వైపు నుంచి భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారని, పహారా కాస్తోన్న జవాన్లపై కాల్పులు జరిపారని అన్నారు. ఈ కాల్పుల్లో ఒక జవాను తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ఆ వెంటనే భారత జవాన్లు ఎదురు కాల్పులు నిర్వహించగా.. వారు పాకిస్తాన్ భూభాగం వైపు పారిపోయారని వెల్లడించారు.
వారంరోజుల వ్యవధిలో అనుమానిత ఉగ్రవాదులు భారత్ లోకి చొచ్చుకుని రావడం ఇది రెండోసారి. ఇదివరకు నలుగురు ఉగ్రవాదులు భారత్ వైపు అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించగా.. జవాన్లు వారిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా కెరన్ సెక్టార్ సమీపంలో భారత్-పాకిస్తాన్ సరిహద్దులకు అత్యంత సమీపంలో చెల్లాచెదురుగా పడిన ఉగ్రవాదుల మృతదేహాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా భారత సైనికాధికారులు పాకిస్తాన్ కు సూచించారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండురోజుల వ్యవధిలో ఉగ్రవాదులు మరోసారి చొరబాడటానికి ప్రయత్నించడం గమనార్హం.