యూపీలో సర్వే సత్యాలు: ఎస్పీ బీఎస్పీ పొత్తుతో బీజేపీ మటాష్..కమలంకు సీట్లు ఎన్నో తెలుసా..?
లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో అప్పుడే దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే కీలక పాత్ర పోషించే రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. అన్ని రాజకీయపార్టీల దృష్టి ఇప్పుడు ఉత్తర్ప్రదేశ్పై పడింది. అంతేకాదు ఆ రాష్ట్రంలోని రెండు బలమైన పార్టీలు ఎస్పీ బీఎస్పీలు ఒక్కటి కావడంతో బీజేపీకి ఎన్నికల్లో ముచ్చెమటలు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్వేలు కూడా బీజేపీకి కష్టమనే సంకేతాలు ఇస్తున్నాయి.
బీజేపీకి యూపీలో గడ్డు పరిస్థితి
ఎన్నికల వేళ సర్వేల సందడి ఊపందుకుంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్య పాత్ర పోషించే ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంపైనే ప్రస్తుతం సర్వేల జోరు కనిపిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు ఏకమయ్యాక ఉత్తర్ ప్రదేశ్లో సమీకరణాలు మారుతున్నాయి. 2014లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ ఈసారి అఖిలేష్ మాయావతిల కలయికతో గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఇండియాటీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్లో ఇదే విషయం తేటతెల్లమైంది.
కమలం పార్టీకి 29 సీట్లు వస్తాయని సర్వే వెల్లడి
అఖిలేష్ యాదవ్ మాయావతిల కలయికతో బీజేపీ ఉత్తర్ ప్రదేశ్లో భారీగా సీట్లు కోల్పోనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 80 సీట్లకు గాను 73 సీట్లలో ఘన విజయం సాధించింది. అదే 2019లో బొమ్మ పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎస్పీ బీఎస్పీ దెబ్బకు కమలం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 29 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. దాదాపు 44 స్థానాల్లో బీజేపీ ఓటమి ఖాయంగా కనిపిస్తోందని సర్వే లెక్కలు కట్టింది.
ఎస్పీ బీఎస్పీలకు 49 సీట్లు, కాంగ్రెస్కు రెండు సీట్లు
ఉత్తర్ ప్రదేశ్లో మహాగట్భంధన్ ఏర్పడ్డాకే బీజేపీకి కష్టాలు ప్రారంభమయ్యాయని సర్వే ద్వారా తెలుస్తోంది. మహాగట్బంధన్కు 49 సీట్లు వస్తాయని సర్వేలు తెలిపాయి. గతంలో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేయడం వల్ల 5 స్థానాలు మాత్రమే వచ్చాయి. గతంలో జరిగిన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న పార్టీలు కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టాలంటే ఎస్పీ బీఎస్పీలు కలిస్తేనే సాధ్యమవుతుందని భావించిన పార్టీలు ఆమేరకు జట్టుకట్టాయి.ఇదిలా ఉంటే యూపీఏ ఒక్క రాయ్బరేలీ, అమేథీ స్థానాలను మాత్రమే నిలుపుకోనుంది.