జాతీయ జంతువుగా ఆవు: రాజస్థాన్ హైకోర్టు సంచలనం: చంపితే జీవిత ఖైదు, ఇక అంతే!
న్యూఢిల్లీ: ఆవుల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన తాజా ఆంక్షలపై తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరసన గళాలు వినిపిస్తున్న విషయం తెలిసింది. అయితే ఈ విషయంపై రాజస్థాన్ హై కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఆవులను చంపేవారికి ప్రస్తుతం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నారని గుర్తు చేసింది. అయితే ఆవును చంపితే ఇక ముందు జీవితఖైదు విధించాలని రాజస్థాన్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి శిఫారస్సు చేసింది.
మద్రాస్ హైకోర్టు ఇలా !
పశువులను వధ కోసం కొనకుండా, అమ్మకుండా కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై మద్రాస్ హైకోర్టు ఇప్పటికే నాలుగు వారాలు స్టే విధించింది. పశువుల విక్రయాలపై విధించిన నిషేదాన్ని సవాలు చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చెయ్యాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ కి ఆదేశించింది.
మేం పట్టించుకోం, ఏం చేస్తారు ?
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తాము పట్టించుకోమని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పింది. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, త్రిపుర కూడా పశ్చిమ బెంగాల్ బాటలోనే ముందుకు వెలుతున్నాయి. పశువుల విక్రయాలపై కేంద్ర విధించిన నిషేధంపై పలు సంఘాలు మండిపడుతున్నాయి.
ముఖ్యమంత్రులతో సదస్సు !
పశువధ నిషేధంపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సదస్సు నిర్వహిస్తామని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తామని ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ స్ఫష్టం చేశారు.
ఆవు జాతీయ జంతువు గా ప్రకటించండి !
పశువుల వధపై నిషేధం విధించిన విషయంపై దాఖలు అయిన పిటిషన్లను బుధవారం రాజస్థాన్ హైకోర్టు విచారించింది. రాజస్థాన్ రాజదాని జైపూర్ లో విచ్చలవిడిగా గో మాంసం విక్రయిస్తున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. వాదనలు విన్నతరువాత ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.
అధికారంలో బీజేపీ ఉంది కదా !
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (ఎన్ డీఏ) పశువధపై నిషేధం విధించింది. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో ఆ రాష్ట్ర హైకోర్టు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సంచల తీర్పు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది వేచిచూడాలి.