శశికళకు ఎసరు: జయ వేదనిలయంపై కొత్త డిమాండ్
చెన్నై: పోయెస్ గార్డెన్లోని జయలలిత నివాసం వేద నిలయంపై కొత్త వాదన ముందుకు వచ్చింది. ఆ ఇల్లు జయలలిత ప్రియసఖి శశికళకు చెందుతుందని భావిస్తుండగా, ఆమెకు ఎసరు పెట్టే వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కె. షణ్ముగం అనే వ్యక్తి చేసిన విజ్ఞప్తి ఆ విషయాన్ని తెలియజేస్తోంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోస్ గార్డెన్లోని ఇంటిని ఆమె స్మారకంగా ప్రకటించాలని కె. షణ్ముగం ప్రభుత్వాన్ని కోరాడు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు.
పోస్ గార్డెన్లోని వేద నిలయానికి సంబంధించి ఇప్పటికే అనేక పుకార్లు తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. పోయెస్ గార్డెన్ ఇంటిని శశికళ సొంతం చేసుకుంటారనే వార్తలొస్తున్న నేపథ్యంలో తాను ఈ అభ్యర్థనను వ్యక్తం చేసినట్లు కూడా ఆయన తెలిపారు.
ఇప్పటికే తన ప్రతిపాదనను ఆమోదిస్తూ 13వేల మందికి పైగా సంతకాలు చేశారని ఆయన తెలిపారు. సీఎం పన్నీరు సెల్వం తమ ప్రతిపాదనను మన్నించి ఆ ఇంటిని జయ స్మారకార్థంగా మార్చాలని కోరారు.
రామప్పురంలో ఉన్న ఎంజీ రామచంద్రన్ ఇంటిపై నెలకొన్న వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. జయలలిత ఇంటికి కూడా ఆ పరిస్థితి రాకూడదనేఉద్దేశంతోనే తాను ఈ పిటిషన్ ద్వారా అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు.