మగాళ్లూ.. బీ కేర్ ఫుల్ : ఆ విషయంలో అతి వద్దు, తక్కువైనా.. ముప్పే
లండన్ : ఏదైనా సరే అవసరమైన మేరకే మిత పరిమితిలో ఉంటే మంచిది. ముఖ్యంగా మనుషులకు సంబంధించి ఆహారం తీసుకునే విషయంలోనైనా.. నిద్ర విషయంలోనైనా.. మితంగా వ్యవహరించడమే మంచిదంటున్నాయి సర్వేలు. తాజాగా మగాళ్ల నిద్రపై పరిశోధన నిర్వహించిన ఓ సంస్థ అతి నిద్ర, అలాగే తక్కువ నిద్ర మగాళ్ల ఆరోగ్యాన్ని ముప్పు అని చెబుతోంది.
నెదర్లాండ్స్ కి చెందిన పరిశోధనా సంస్థ వీయూ మెడికల్ సెంటర్ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా సగటున రోజుకు 7 గంటల కంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోయే మగాళ్లకు మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదికలో వెల్లడైంది.
మొత్తం 14 యూరోపియన్ దేశాలకు చెందిన 30-60 ఏళ్ల మధ్య ఉన్న 800 మంది వలంటీర్లపై అధ్యయనం చేసిన సంస్థ.. నిద్ర సమయాన్ని పరిగణలోకి తీసుకుని స్త్రీ పురుషుల్లో గ్లూకోజ్ జీవక్రియ జరిగే విధానంపై ప్రధానంగా అధ్యయనం చేశారు పరిశోధకులు. ఇందులో తేలిందేంటంటే.. అతినిద్ర, నిద్రలేమికి గురైన పురుషుల జీవక్రియల్లో శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్ కు ప్రతిస్పందించడం తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు.
ఈ సమస్య వల్ల పురుషుల్లో గ్లూకోజ్ ను వినియోగించుకునే సామర్థ్యం కూగా పడిపపోతున్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు. ఈ పరిణామాలు పురుషుల్లో డయాబెటిస్ కి దారి తీసే అవకాశం ఉండడంతో పాటు.. బీపీ స్థాయి కూడా చాలావరకు పెరిగే అవకాశం ఉన్నట్టు గుర్తించారు.
అయితే, మహిళల విషయంలో మాత్రం పరిశోధనా ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అతి నిద్ర లేక తక్కువ నిద్ర వల్ల మహిళలకు వచ్చిన ప్రమాదమేమి లేదంటోంది నివేదిక. పైగా దీనివల్ల మహిళల్లో గ్లూకోజ్ జీవక్రియకు ఆటంకాలు ఏర్పడకపోగా, ఆ ప్రక్రియ మరింత మెరుగుపడిందని పరిశోధన బృందం సారథి ఫెంకే రూటర్స్ తెలిపారు. క్లోమానికి సంబంధించి ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే బీటా కణాల పనితీరు కూడా దీనివల్ల మరింత మెరుగైనట్టు తెలుస్తోంది.