మోడీపై విరుచుకుపడిన మల్లికా సారాభాయ్
అహ్మదాబాద్: ప్రముఖ భరతనాట్య కళాకారిణి, సామాజికవేత్త మల్లికా సారాభాయ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రముఖ నాట్యకళాకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మృణాళిని సారాభాయ్ (97) మృతి పట్ల ప్రధాని మోడీ కనీసం సంతాపం వ్యక్తం చెయ్యలేదని విమర్శించారు.
గుజరాత్ కు చెందిన మృణాళిని సారాభాయ్ దేశ ప్రతిష్టను ఇనుమడింప చేశారని, అలాంటి సీనియర్ కళాకారిణి కన్ను మూస్తే నివాళులు అర్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీకి సమయం లేదని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు సీనియర్ కళాకారిణి మృణాళిని సారాభాయ్ కన్ను మూసిన విషయం ప్రధానికి పట్టలేదని ఆమె తన ఫేస్ బుక్ లో వ్యాఖ్యానించారు. నట్యాకళారంగానికి ఎనలేని సేవలు చేసి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాధించి పెట్టిన గొప్ప కళాకారిణి మృణాళిని సారాభాయ్ అని గుర్తు చేశారు.
అలాంటి గొప్ప కళాకారిణి మరణం పట్ల దేశ ప్రధాని స్పందించకపోవడం శోచనీయమని ఆమె విచారం వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కనీస మర్యాదను పాటించాలని హితవు చెప్పారు.
లెజండ్రీ నాట్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ గుజరాత్ హస్తకళల అభివృద్ది సంస్థకు అనేక సంవత్సరాల పాటు చైర్ పర్సన్ గా పని చేశారు. తోలుబొమ్మలాట, గ్రామీణ హస్తకళలు తదితర కళారూపాల పునరుద్దరణకు విశేష కృషి చేశారని ఆమె కుమార్తె మల్లికా సారాభాయ్ గుర్తు చేశారు.