అదానీ వ్యవహారంలో మోడీపై మల్లిఖార్జున్ ఖర్గే విమర్శలు: ఛైర్మన్ ధన్కర్ హితవు
న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. తాజాగా, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఖర్గే వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. అదానీ విషయంలో ఇంత ఆందోళన జరుగుతున్నా ప్రధాని మోడీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రధాని.. పారిశ్రామికవేత్తల విషయంలో ఎందుకుండరని ప్రశ్నించారు.

విద్వేషాలు రెచ్చగొట్టే నేతల పట్ల ప్రధాని మోడీ కటువుగా ఉంటే.. టికెట్ వస్తుందో రాదోనని భయపడతారని.. కానీ, ప్రధాని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌని బాబాలా ఉంటున్నారని మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు.
అయితే, ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీ హోదాకు అలాంటి పదాలు వాడటం సరికాదని మల్లిఖార్జున్ ఖర్గేకు ధన్కర్ సూచించారు. ప్రతిపక్ష నాయకుడి మాటలు సభలోని సభ్యులందరి మాటలను ప్రతిబింభించాలని హితవు పలికారు. దయచేసి సభలో హుందాగా వ్యవహారించాలని, సభ స్థాయిని పెంచేలా మాట్లాడాలని సూచించారు.
కాగా, ఖర్గే వ్యాఖ్యలతో అధికార పక్షం సభ్యులు మండిపడ్డారు. ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ అధికార పక్షంవైపున మాట్లాడుతున్నారని విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో జాతీయ ప్రయోజనాల కోసమే చర్చ జరగాలని రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ సూచించారు. కాంట్రాక్టులను బహుమతిగా ఇచ్చే దేశంగా భారత్ను చూపేవిధంగా ఖర్గే ప్రయత్నిస్తున్నారని ధన్కర్ ఆరోపించారు.
2014 నుంచి అదానీ ఆస్తులు భారీగా పెరిగాయని మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. రుజువులు లేకుండా ఆరోపణలు చేయొద్దని ధన్కర్ సూచించారు. ఏవో కొన్ని నివేదకల ఆధారంగా దేశ ప్రతిష్టను దిగజార్చేలా ఎవరూ వ్యవహరించకూడదని రాజ్యసభ ఛైర్మన్ సూచించారు.












Click it and Unblock the Notifications