మల్లిఖార్జున ఖర్గే రాజీనామా - సోనియాకు లేఖ..!!
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన మల్లిఖార్జున ఖర్గే కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కీలక పదవికి రాజీనామా చేసారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ పంపారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఖర్గేను అధినాయకత్వం అధ్యక్ష బరిలో నిలబెట్టటం ద్వారా ఆయన కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రచారం లో ఉన్నారు. గాంధీ కుటుంబం పట్ల విధేయత..పార్టీ పట్ల అంకిత భావం ఉన్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో అనేక హోదాలో ఆయన పని చేసారు.

అధ్యక్ష పదవికి ఖర్గే ఎన్నిక ఖాయమంటూ..
దళిత వర్గానికి అందునా దక్షిణాదికి ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ చివరి నిమషంలో ఖర్గే పేరు తెర మీదకు తీసుకొచ్చింది. అధిష్ఠానం సూచనల మేరకే ఖర్గే చివరి నిమిషంలో నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఖర్గేకు పార్టీ నేతలతో పాటుగా.. జీ -23 నేతలు సైతం మద్దతుగా నిలిచారు. చివరి వరకూ దిగ్విజయ్ - శశి థరూర్ మధ్య అధ్యక్ష ఎన్నికల పోటీ ఉంటుందని అందరూ అంచనా వేసారు.
చివరి నిమిషంలో ఖర్గే పేరు ఖరారు చేయటంతో దిగ్విజయ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఖర్గేకు మద్దతు ప్రకటించారు. దీంతో..ఖర్గే- శశి థరూర్ తో పాటుగా కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ నేతగా పని చేసిన జార్ఖండ్ నేత ఠాకూర్ కూడా నామినేషన్ దాఖలు చేసారు. ఈ నెల 8వ తేదీ వరకే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరగనుంది. 19న ఫలితాలు ప్రకటిస్తారు.

రాజ్యసభ విపక్ష నేత పదవికి రాజీనామా
మల్లిఖార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడు కావటం ఖాయమని పార్టీలో ఇప్పటికే నేతలు అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉదయ్ పూర్ చింతన్ శిబిర్ లో చేసిన తీర్మానం మేరకు ఒక వ్యక్తికి ఒకే పదవి వర్తిస్తుంది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం అధ్యక్ష బరిలో నిలిచిన మల్లిఖార్జున ఖర్గే రాజ్యసభలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా, ఆయన ఆ పదవికి రాజీనామా చేస్తూ సోనియాను కలిసి లేఖ అందించారు. పార్టీ నేత రాహుల్ సైతం తాజాగా ఇదే తీర్మానం అంశాన్ని ప్రస్తావించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్ష బరిలో నిలవటానికి సిద్దమైన సమయంలో..రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత రాజస్థాన్ కాంగ్రెస్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బరిలో ముగ్గురు - ఖర్గేకే పార్టీ మద్దతు
గెహ్లాట్ కు మద్దతుగా 90 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖల అంశం పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఈ వివాదంతో అధ్యక్ష బరిల నుంచి గెహ్లాట్ దూరమయ్యారు. రాజస్థాన్ పరిణామాలకు పార్టీ అధినేత్రి సోనియాను కలిసి క్షమాపణ కోరారు.
ఇప్పుడు ఖర్గే సైతం తన రాజీనామా లేఖలో ఉదయ్ పూర్ తీర్మానం గుర్తు చేస్తూ..తాను అధ్యక్ష బరిలో నిలవటంతో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో, ఇప్పుడు ఖర్గే స్థానంలో రాజ్యసభలో మరో నేత ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications