ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం.. శశి థరూర్ ఘోర ఓటమి!!
ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. శశిధరూర్ పై దాదాపు 6,700 ఓట్ల తేడాతో మల్లికార్జున ఖర్గే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మల్లికార్జున్ ఖర్గే కు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో 7897 ఓట్లు రాగా, శశిధరూర్ కు ఒక 1072 ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లలో 415 ఓట్లు చెల్లనివి గా గుర్తించారు.
130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఉత్కంఠ రేపిన ఆరోసారి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
130 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గాంధీ కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో ఎవరూ పోటీలో లేకపోవడంతో మల్లికార్జున ఖర్గే, శశిధరూర్ పోటీలో నిలిచారు. 9500 మందికిపైగా ప్రతినిధులు ఈ అధ్యక్ష ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక అత్యంత ఆసక్తికరంగా సాగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో అగ్రనేతలు స్పష్టంగా మల్లికార్జున ఖర్గే కు మద్దతుగా నిలిచారు.
మల్లికార్జున ఖర్గే విజయం వెనుక కారణాలివే
ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత తొలిసారిగా గాంధీ కుటుంబం నుండి కాక, గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ గెలుపుతో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ పీఠాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తిగా, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తిగా మల్లికార్జున ఖర్గేకు ఈ ఎన్నికలలో లాభం చేకూరింది. అటు గాంధీ కుటుంబం, పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా ఉండడంతో ఆయన గెలుపు లాంఛనమేనని మొదటి నుంచి అభిప్రాయం వ్యక్తమైంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై శశిధరూర్ స్పందన ఇదే
ఇక ఈ ఎన్నికల ఫలితాలపై స్పందించిన శశిధరూర్ పార్టీ ప్రతినిధుల నిర్ణయమే అంతిమ నిర్ణయంగా భావిస్తాం అన్నారు. నేను దానిని వినమ్రంగా స్వీకరిస్తున్నానని శశిధరూర్ తెలిపారు తమ పార్టీ అధ్యక్షుడిని పార్టీలో పనిచేసే కార్యకర్తలే స్వయంగా ఎన్నుకునేలా అనుమతించే పార్టీలో సభ్యుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు శశిధరూర్. ఇక పార్టీ సీనియర్ నాయకుడు, కొత్త అధ్యక్షుడు తన అనుభవంతో పార్టీని ముందుకు నడిపిస్తారని, ఆయన మార్గదర్శకత్వంలో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళతామని తాను విశ్వసిస్తున్నా అని తెలిపారు శశిధరూర్.
ఉత్కంఠగా సాగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ఆరోపణలు ప్రత్యారోపణలు
ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో కౌంటింగ్ కొనసాగుతున్న క్రమంలో అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి శశిధరూర్ ఏజెంట్ సల్మాన్ సోజ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎన్నికల చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కి ఫిర్యాదు చేశారు. ఇక అక్రమాలకు సంబంధించిన ఫోటోలు, ఆధారాలను కూడా సమర్పించారు. శశిధరూర్ ఏజెంట్ చేసిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి ఆయనపై మండిపడ్డారు. మొత్తానికి ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పూర్తయింది.