రాష్ట్రపతి ముర్ముకు మమతా బెనర్జీ క్షమాపణ-ఎందుకో తెలుసా ?
దేశంలో తొలి గిరిజన మహిళా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఇవాళ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. తాజాగా చోటు చేసుకున్న ఓ పరిణామంపై తాను క్షమాపణలు చెబుతున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
మమతా బెనర్జీ కేబినెట్లో తృణమూల్ కాంగ్రెస్ కేబినెట్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర పార్టీలే కాదు స్వయంగా టీఎంసీ నేతలు కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. మమతా బెనర్జీ తన కేబినెట్ మంత్రిని మందలించారు కూడా. అయినా వివాదం సద్దుమణగకపోవడంతో మమతా బెనర్జీ ఇవాళ సాటి మహిళ, రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత దాడులు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్నారు.

తాము రాష్ట్రపతి ముర్ముకు ఎంతో గౌరవం ఇస్తామని, ఆమె ఓ స్వీట్ లేడీ అంటూ మమతా బెనర్జీ ప్రశంసలతో ముంచెత్తారు. తమ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యల్ని తాము ఖండిస్తున్నామని, రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. అందం అనేది బయటికి కనిపించేది కాదని, లోపల ఉండేదని మమత ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తృణమూల్ మంత్రి అఖిల్ గిరి రాష్ట్రపతిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు.ఇవాళ కూడా రాజ్ భవన్ వరకూ ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications