అవినీతి కేసులోకి నన్ను లాగొద్దు.. నేను జీతం కూడా తీసుకోను..!!
తప్పులు చేసేవారికి, అవినీతికి పాల్పడేవారికి తాను ఎప్పుడూ మద్దతు పలకనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తప్పుచేసినవారు ఎలాంటివారైనా, వారు తప్పుచేసినట్లు నిరూపితమైనా, యావజ్జీవ శిక్ష పడినా తాను ఏమీ అనుకోనన్నారు. ఇటువంటి అవినీతి వ్యవహరాల్లోకి తనను లాగొద్దని.. ఎందుకంటే తాను ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం కూడా తీసుకోవడంలేదని తెలిపారు.
ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తర్వాత మంత్రి అరెస్ట్ పై మమత స్పందించారు. ఓ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ తప్పులు చేసినవారికి సరిదిద్దుకునేందుకు ఎవరైనా ఒక అవకాశం ఇవ్వాలని, అలాగని అందరూ సాధువులేనని తాను భావించడంలేదన్నారు. తానైతే ఇంతవరకు ఎటువంటి తప్పచేయలేదన్నారు.
ఈ కేసులో మంత్రి ఛటర్జీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్టు చేయడంతోపాటు ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ నివాసంలో రూ.21కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. సోదాల్లో మంత్రికి మరిన్ని అక్రమాస్తులన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిద్దరితోపాటు మంత్రి వ్యక్తిగత కార్యదర్శి సుకాంత ఆచార్యను కూడా అరెస్ట్ చేశారు. 2014-2021 మధ్యలో విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన పార్థా మీద ఆరోపణలు రావడంతో సుదీర్ఘంగా 26 గంటలపాటు ఆయన్ను విచారించిన ఈడీ తమ అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ తర్వాత ఛటర్జీ నాలుగుసార్లు ముఖ్యమంత్రికి ఫోన్చేశారని ఆరోపణలు వచ్చాయి. వీటిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఖండించాయి.