భవానీపూర్ ఉపఎన్నికలో భారీ ఆధిక్యం దిశగా మమతా బెనర్జీ: టీఎంసీ సంబరాలు షురూ
కోల్కతా: దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న పశ్చిమబెంగాల్ భవానీపూర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి, టీడీసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17వ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్పై మమతా బెనర్జీ 45వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మమతా బెనర్జీకి 67,620 ఓట్లు రాగా, ప్రియాంక టిబ్రేవాల్ 21,882 ఓట్లు పోలయ్యాయి. ఇక సీపీఐ(ఎం) అభ్యర్థికి 2896 ఓట్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు. భవానీపూర్ సహా పశ్చిమబెంగాల్లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మిగిలిన రెండు స్థానాలైన షంషేర్గంజ్, జాంగీపూర్లోనూ టీఎంసీ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మమతా బెనర్జీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీఎంసీ నేతలు, కార్యకర్తలు సంబరాలు ప్రారంభించారు.
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆమెపై బీజేపీ తరపున ప్రియాంక టిబ్రేవాల్, సీపీఐఎం నుంచి శ్రీజిబ్ బిశ్వాస్ పోటీలో ఉన్నారు. అయితే, సీఎం పీఠాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీకి భవానీపూర్ ఉపఎన్నికలో గెలుపు తప్పనిసరిగా మారింది. అయితే, భవానీపూర్ ఉపఎన్నికలో మమతా బెనర్జీ విజయం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల్లోగా అసెంబ్లీ లేదా శాసన మండలికి ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో- మమత బెనర్జీ కోసం తృణమూల్ కాంగ్రెస్కు చెందిన భవానీపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు. దీనితో ఉప ఎన్నిక అవసరమైంది. తృణమూల్ నుంచి మమత, బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేశారు. గురువారం పోలింగ్ ముగిసింది. భవానీపూర్తో పాటు షంషేర్ గంజ్, జంగీపూర్ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించారు. ఈ మూడు చోట్ల కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోంది.
ఈ మూడు నియోజకవర్గాల ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ఆరంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కపెట్టారు. ఇందులోనూ మమత బెనర్జీ ఆధిక్యతను కనపరిచారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో మమతకు 775 ఓట్ల మెజారిటీ లభించింది. అదే దూకుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లోనూ కనిపించింది. తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోన్నారు. రౌండ్ రౌండ్కూ మమత ఆధిక్యత పెరుగుతోంది.
తొలి రెండు రౌండ్లు ముగిసే సరికి ఆమె 3,689 ఓట్లకు పైగా ఆధిక్యతలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రియాంక టిబ్రేవాల్కు 881, సీపీఎం అభ్యర్థి శ్రీజీబ్ బిశ్వాస్కు 85 ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తం 21వ రౌండ్లుగా కౌంటింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి మమత బెనర్జీ కనీసం 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీని సాధిస్తారని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ ఉపఎన్నిక గెలుపుతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు అన్ని అడ్డంకులు తొలగినట్లేనని చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి టిబ్రేవాల్ గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ మమత గెలుపును వన్ సైడ్ చేసేశారు.












Click it and Unblock the Notifications