కుట్రే: 30గంటల తర్వాత సచివాలయం బయటకు మమత
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని టోల్గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి నుంచి సచివాలయంలోనే గడిపిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని టోల్గేట్ల వద్ద ఆర్మీ మోహరించడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి నుంచి సచివాలయంలోనే గడిపిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. గురువారం రాత్రి నుంచి కార్యాలయంలోనే ఉన్న ఆమె సుమారు 30 గంటల తర్వాత శుక్రవారం రాత్రి సచివాలయాన్ని వీడి బయటకొచ్చారు.
ఆర్మీ మోహరింపు: సచివాలయంలోనే మమత, రాజకీయం చేయొద్దన్న వెంకయ్య
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి సైన్యాన్ని ఉప సంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్రగా అభివర్ణించారు.
కాగా, ఈ అంశంపై శుక్రవారం పార్లమెంటులో టీఎంసీ ఎంపీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ తృణమూల్ సహా ప్రతిపక్షాలూ ఈ అంశాన్ని లేవనెత్తాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం దురదృష్టకరమని పేర్కొంది.
ఆర్మీ వైపు వేలు చూపొద్దు: మోడీ వార్నింగ్, 'అవినీతి లేని భారత్'
ఇదే అంశంపై సైన్యం కూడా స్పందించింది. మమత ఆరోపణలు నిరాధారమైనవని కొట్టేపారిసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము టోల్గేట్ల వద్ద తనిఖీలు చేపట్టామని, దానికి సంబంధించిన పత్రాలను కూడా ఆర్మీ విడుదల చేసింది. కాగా, ఆర్మీపైనా రాజకీయం తగదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. మమతకు హితవు పలికారు.