ఆస్పత్రి నుంచి మమత వీడియో సందేశం.. కార్యకర్తలకు కీలక సూచన.. అవసరమైతే వీల్ ఛైర్లోనే ప్రచారం...
నందిగ్రామ్ దాడిలో గాయపడి ప్రస్తుతం కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం(మార్చి 11) ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు శాంతియుతంగా ఉండాలని... ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు. మమతపై దాడి పట్ల ఆగ్రహంతో ఉన్న టీఎంసీ శ్రేణులు.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మమతా కార్యకర్తలను ఉద్దేశించి ఈ సూచన చేశారు.
మరో రెండు,మూడు రోజుల్లో తాను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటానని... అవసరమైతే కొద్దిరోజులు వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని దీదీ స్పష్టం చేశారు. 'నిన్న సాయంత్రం కారు ఎక్కుతూ నేను దేవుడిని ప్రార్థిస్తుండగా... కొంతమంది ఒక్కసారిగా నన్ను తోసేశారు. దాంతో నా ఎడమ కాలి మడమ ఎముకకు,పాదానికి,మోకాలికి గాయమైంది. ఆ సమయంలో ఛాతి నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాను. ప్రస్తుతం చికిత్స అందుతోంది. రెండు,మూడు రోజుల్లో మళ్లీ కార్యక్రమాల్లో పాల్గొంటాను. బహుశా కొద్దిరోజులు వీల్ చైర్ ఉపయోగించాల్సి వస్తుందేమో...' అని ఆ వీడియోలో పేర్కొన్నారు.

బుధవారం(మార్చి 10) నందిగ్రామ్లో నామినేషన్ అనంతరం మమతా బెనర్జీ తనపై దాడి జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను కారులోకి ఎక్కుతున్న సమయంలో నలుగురైదుగురు తనను నెట్టివేశారని... కారు డోర్ను లాగడంతో తన కాలు అందులో ఇరుక్కుపోయి గాయమైందని ఆమె ఆరోపించారు. కుట్ర పూరితంగానే ఇది జరిగిందని ఆరోపించారు. అనంతరం ఆమె కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.మమతపై దాడిని టీఎంసీ శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మమతను హత్య చేసేందుకే కుట్ర జరిగిందని... దీనిపై విచారణ జరిపించాలని టీఎంసీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అర్దాంతరంగా ఎన్నికల సంఘం డీజీపీని మార్చడం మమతా బెనర్జీ ప్రాణహానికి కారణమైందని ఫిర్యాదులో పేర్కొంది.
দলনেত্রীর @MamataOfficial আবেদন pic.twitter.com/SPoD3m7Iu3
— All India Trinamool Congress (@AITCofficial) March 11, 2021
మరోవైపు బీజేపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైంది.ఓటమి భయంతోనే మమత డ్రామాలకు తెరలేపారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఓట్ల కోసం మమత ఎంతకైనా దిగజారుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శించారు.
మమతా బెనర్జీపై జరిగిన దాడిపై మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని... కానీ ఇలాంటి హింసాత్మక సంఘటనలు ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తాయని అన్నారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరారు. కాగా,ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో బెంగాల్ అంసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications