బీజేపీకి హెచ్చరిక: ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉంది... బెంగాల్ కు రావొద్దు
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ ఓడిపోతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మమతాబెనర్జీ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.
నిత్యావసరాలపై జీ ఎస్టీ వేయడంపై మమత మండిపడ్డారు. ఆ పార్టీకి బుర్ర పనిచేయడంలేదని, తీపి పదార్థాలు, లస్సీ, పెరుగు, మరమరాల్లాంటి ఆహార పదార్థాలపై జీఎస్టీ వేస్తే ప్రజలు ఏం తింటారని ప్రశ్నించారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినా జీఎస్టీ వసూలు చేస్తారా? అని ప్రశ్నించారు. కొవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా అమరవీరుల దినోత్సవాన్ని తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించడంలేదు. ఇప్పుడు మమత మూడోసారి అధికారంలోకి రావడంతో కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు.
ఇంధన ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సభపైకి ఎల్పీజీ సిలిండర్ను తీసుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ క్యాడర్ కు శిక్షణ ఇచ్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని, బ్యాంకులను ప్రయివేటు పరం చేయడం మతిలేని చర్య అన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బీజేపి గురించి... తర్వాత ఛత్తీస్గఢ్ను పడగొడతామంటారని.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ వస్తారన్నారు. బెంగాల్కు రావొద్దని మమత హెచ్చరిస్తోందని, ఎందుకంటే ఇక్కడ రాయల్ బెంగాల్ టైగర్ ఉందన్నారు.