బీజేపీకి 200 సీట్లు దాటవు! మోడీ భవిష్యత్తుపై మమత జోస్యం!
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దక్కడం కూడా గగనమని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవడం ఖాయమని దీదీ అభిప్రాయపడ్డారు. ఇవి తన మాటలు కావని, రాజకీయ పండితులు చెబుతున్న లెక్కలని స్పష్టం చేశారు.
పరీక్ష పేపర్ లలో పార్టీలపై , పార్టీ నేతలపై ప్రశ్నలు .. మొన్న ఏపీ నేడు బెంగుళూరు ఇదెక్కడి రాజకీయం
6 రాష్ట్రాల్లో 5 నుంచి 10 సీట్లు
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదన్నారు మమతా బెనర్జీ. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, బెంగాల్లో కలిపి ఆ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు కూడా రావని చెప్పారు. ఈ ఆరు రాష్ట్రాల్లో 193 లోక్సభ స్థానాలుండగా.. వాటిలో 5 నుంచి 10 కూడా బీజేపీ ఖాతాలో పడవని దీదీ అభిప్రాయపడ్డారు.
మోడీకి కూటమి తిప్పలు
వివిధ రాష్ట్రాల్లో ఏర్పడిన కూటములు మోడీని దెబ్బతీయడం ఖాయమన్నారు మమత బెనర్జీ. మోడీ ప్రభంజనం కొనసాగిన 2014 ఎన్నికల్లో బీజేపీ కర్నాటకలో 21లో 17 సీట్లు గెల్చుకున్నప్పటికీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. ఆ రాష్ట్రంలో 56శాతం ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్, జేడీఎస్లు కూటమిగా ఏర్పడినందున మోడీ గడ్డు పరిస్థితి ఎదుర్కోకతప్పదన్నారు.
యూపీలో బీజేపీ తగ్గనున్న సీట్లు
2014 ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లో 80లో 71 సీట్లు గెలిచి ప్రభంజనం సృష్టించిన మోడీకి ఈసారి ఓటర్లు షాక్ ఇవ్వడం ఖాయమన్నారు దీదీ. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీలు కలిసి పోటీ చేస్తున్నందున గత ఎన్నికల్లో సాధించిన స్థానాల్లో సగాన్ని నిలబెట్టుకోవడం కూడా బీజేపీకి కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుబి మోగించిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మొత్తం 60 లోక్సభ స్థానాల్లో బీజేపీకి 30 కూడా దక్కవని దీదీ తేల్చి చెప్పారు.
బీజేపీ మేజిక్ ఫిగర్ చేరుకోవడం అసాధ్యం
ఈసారి ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్ చేరుకోవడం అసాధ్యమని దీదీ జోస్యం చెప్పారు. 11 రాష్ట్రాల్లో 333 సీట్లలో బీజేపీకి 65 సీట్లు కూడా రావన్న ఆమె ఇక మిగిలిన 207 స్థానాల్లో మోడీ 206 గెల్చుకుంటే తప్ప అధికారం చేపట్టడం సాధ్యం కాదని చెప్పారు. ఆ 207 స్థానాల్లోనూ మోడీకి 135 సీట్లు వస్తే అదే ఎక్కువని చెప్పారు.