జై హింద్, జై బంగ్లా: జై శ్రీరాం నినాదాలపై దీదీ గరం గరం, మోడీ సమక్షంలోనే ఫైర్..
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్ కతాలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అయితే మమతా ప్రసంగించే సమయం కన్నా ముందు.. అక్కడ జై శ్రీరాం నినాదాలు మిన్నంటాయి. దీంతో దీదీకి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వచ్చి.. ఇదీ ప్రభుత్వ కార్యక్రమమా..? లేక పార్టీ కార్యక్రమమా అంటూ విరుచుకుపడ్డారు.
Recommended Video
సర్కార్ నిర్వహిస్తోన్న కార్యక్రమంలో నినాదాలు చేయడం సరికాదన్నారు. ప్రధాని మోడీ హాజరైన కార్యక్రమంలో ఇలా చేయడం ఏంటీ అన్నారు. జై హింద్, జై బంగ్లా అంటూ మాట్లాడకుండానే వెనుదిరిగారు. స్టేజీ దిగి మరీ తన నిరసన వ్యక్తం చేశారు. దీదీ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఒక్కసారిగా మమతా మండిపడటంతో కిమ్మనకుండా ఉండిపోయారు.
ప్రధాని మోడీ మధ్యాహ్నం కోల్ కతా చేరుకున్నారు. ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి పుర్నెడు బసు స్వాగతం పలికారు. గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్, మంత్రి ఫిర్హాద్ హకీం ఆర్సీటీసీ గ్రౌండ్లో వెల్ కం చెప్పారు. నేషనల్ లైబ్రరీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. తర్వాత విక్టోరియా మెమోరియల్ వద్ద కార్యక్రమం జరిగింది. సీఎం మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అక్కడ కొందరు జై శ్రీరాం నినాదాలు చేయగా.. దీదీకి కొపమొచ్చింది.
కొద్ది రోజుల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎలాగైన పాగా వేయాలని బీజేపీ అనుకుంటోంది. అందులో భాగంగానే జేపీ నడ్డా పర్యటించారు. తర్వాత అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. ఇప్పుడు ప్రధాని మోడీ పాల్గొన్నారు. పేరుకు ప్రభుత్వ కార్యక్రమం అయినా.. లోన మాత్రం తమ పార్టీ బలోపేతం చేయడమేనని అందరికీ తెలుసు.. అదే విషయాన్ని దీదీ బయటకు చెప్పారు. రాజకీయాలు/ ప్రభుత్వ కార్యక్రమాలు వేరు అంటూ కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని తెలియజేశారు.