మతితప్పింది: మోడీ, మమతల మధ్య చిత్రపటం చిచ్చు
న్యూఢిల్లీ/కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీల మధ్య ఓ చిత్రపటం పెద్ద చిచ్చునే రగిల్చింది. ఇరువురి నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆదివారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ... మమతపై విమర్శల వర్షాన్ని కురిపించారు.
శారదా చిట్స్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సుదీప్తసేన్ మమత చిత్రపటాన్ని రూ.1.8కోట్లకు కొనుగోలు చేయడం ద్వారా తన అక్రమార్జనలో ఆమెకు వాటా ఇచ్చారని ఆరోపించారు. దీనిపై మమత సహా ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు. మోడీ అధికారంలోకి వస్తే దేశం సర్వనాశనమవుతుందని, ఆయన ప్రధాని అయితే దేశానికి పీడకలలేనని మమత మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల రూపకర్త నుంచి అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన దుస్థితిలో బెంగాల్ లేదన్నారు.

మరోవైపు తృణమూల్ కూడా మోడీపై భగ్గుమన్నారు. మోడీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని లేదా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామన్నారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా స్పందిస్తూ.. మోడీ జరిగిన వాస్తవాన్ని చెప్పారని, దానిపై ఎలాంటి చర్యలకైనా సిద్ధపడే స్వేచ్ఛ తృణమూల్ నేతలకు ఉందన్నారు. మోడీ హవాను చూసి మమతకు మతి తప్పిందని బిజెపి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ తృణమూల్కు మద్దతుగా నిలిచింది. ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం మోడీ కుయుక్తుల్లో భాగమన్నారు. మమత తాజాగా ఆయన బాధితుల జాబితాలో చేరారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. మరోవైపు మోడీ చేసిన ప్రసంగం పైన వివరాలు ఇవ్వాలని ఈసి జిల్లా అధికారిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications