దీదీపై దాడి: బెంగాల్లో రాజకీయ దుమారం... డ్రామా అంటున్న బీజేపీ.. కుట్ర అంటున్న టీఎంసీ...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తుండగా... రాజకీయ లబ్ది కోసమే మమత అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు మమతపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్దమైంది. మొత్తంగా బెంగాల్ రాజకీయమంతా ఇప్పుడు మమతపై జరిగిన దాడి చుట్టే తిరుగుతోంది.

ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్దమైన బీజేపీ
ముఖ్యమంత్రి మమత బెనర్జీపై కోల్కతాలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ బెనర్జీ తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. అసలేం జరిగింది... ఎవరు దీనికి బాధ్యులు అన్నది తేలాలన్నారు. ఘటనపై విచారణ పూర్తయ్యేంతవరకూ నందిగ్రామ్లో స్థానిక పోలీసులను విధుల నుంచి తప్పించాలని కూడా కోరుతామన్నారు. లేదంటే విచారణను వారు ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు.

ఈసీనే బాధ్యత వహించాలన్న టీఎంసీ...
తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎన్నికల కమిషన్ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేయనున్నాయి. ఈ ఘటనకు కేంద్ర ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని మంత్రి పార్థా చటర్జీ డిమాండ్ చేయడం గమనార్హం. రాష్ట్ర లా అండ్ ఆర్డర్ ఏడీజీ, డీజీలను ఈసీ తొలగించడం వల్లనే సీఎంపై దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ ఘటనపై ట్విట్టర్లో స్పందిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. 'మే 2న బెంగాల్ ప్రజలు వెలువరించే తీర్పును చూసి తట్టుకునేందుకు బీజేపీ శ్రేణులారా ధైర్యంగా ఉండండి. గెట్ రెడీ...' అంటూ కామెంట్ చేశారు. మమత ఆస్పత్రి బెడ్పై కాలికి కట్టుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ దాడి వెనుకాల బీజేపీనే ఉందన్న అర్థం వచ్చేలా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.

అంతా డ్రామా అంటున్న బీజేపీ
ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళన,భయంతోనే మమతా బెనర్జీ దాడి పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. అసలు మమతా బెనర్జీపై దాడి జరిగిందని ఒక్క ప్రత్యక్ష సాక్షి కూడా ధ్రువీకరించలేదన్నారు. మమతా చేస్తున్నదంతా నందిగ్రామ్ ప్రజలు గమనిస్తున్నారని... ఆమె పట్ల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. 'మమతపై జరిగింది నిజమైన దాడా... లేక స్క్రిప్ట్ ప్రకారం జరిగిన డ్రామా అన్నది చూడాలి. రాష్ట్ర ప్రజలు ఇంతకుముందు కూడా ఇలాంటి డ్రామాలు చాలానే చూశారు.ఓట్ల కోసం వారు ఏ స్థాయికైనా దిగజారుతారు...' అని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ విమర్శించారు.

వాయిదాపడ్డ మేనిఫెస్టో విడుదల
మమత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం(మార్చి 11) మధ్యాహ్నం 2గంటలకు కాళీఘాట్లోని తన నివాసంలో దీదీ మేనిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. అయితే బుధవారం(మార్చి 10) సాయంత్రం నందిగ్రామ్లో దీదీపై దాడి జరగడం... ఆమె ఆస్పత్రిలో చేరడంతో మేనిఫెస్టో విడుదల వాయిదా పడక తప్పలేదు. కాగా,నందిగ్రామ్లో నామినేషన్ కార్యక్రమం ముగించుకుని బయలుదేరుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు తనపై దాడి చేశారని మమత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కారులో ఎక్కుతున్న సమయంలో నలుగురైదుగురు తనను బలంగా నెట్టివేశారని,కారు డోర్ను లాగడంతో తన కాలు అందులో ఇరుక్కుపోయి గాయమైందని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications