విమానంలో దుస్తులు విప్పి రచ్చ... పిచ్చి చేష్టలతో బెంబేలెత్తించిన ప్రయాణికుడు...
ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఏసియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఒంటి మీద దుస్తులన్నీ విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతేకాదు,ఎయిర్ హెస్టెస్ను పిలిచి తనకు ముద్దు ఇవ్వాలని కోరాడు. అతనికి దుస్తులు వేసి సీట్లో కూర్చోబెట్టేందుకు విమాన సిబ్బంది తల ప్రాణం తోకలోకి వచ్చింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళ్తే... నాలుగు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిర్ ఏసియా విమానంలో ఒక ప్రయాణికుడు ఎక్కాడు. విమానం టేకాఫ్ అయిందో లేదో అతని రచ్చ మొదలైంది. మొదట కేబిన్ క్రూ వద్దకు వెళ్లిన ఆ ప్రయాణికుడు.. తనకు ఇటాలియన్ స్మూచ్(డ్రింక్) కావాలని కోరాడు. ఆ డ్రింక్ తమ వద్ద లేదని చెప్పడంతో తన ల్యాప్టాప్ను విసిరికొట్టాడు. దీంతో అతను మద్యం లేదా డ్రగ్స్ తీసుకున్నాడా అని విమాన సిబ్బందికి అనుమానం కలిగింది.

ఇంతలోనే బుద్దిమంతుడిలా పోజు కొట్టిన అతను... జరిగిన దానికి క్షమాపణ చెప్పి.. వెళ్లి తన సీట్లో కూర్చొన్నాడు. కాసేపటికి ఏమైందో ఏమో ఒంటి మీద దుస్తులన్నీ విప్పేశాడు. ఆపై కేబిన్ క్రూని పిలిచి తనకు ముద్దు ఇవ్వమని కోరాడు. సిబ్బంది ఎలాగోలా అతనికి దుస్తులు వేయగా... విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మరోసారి దుస్తులన్నీ విప్పేశాడు. అతని ప్రవర్తనతో విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ ప్రయాణికుడిపై ఎయిర్ ఏసియా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను మరోసారి విమాన ప్రయాణం చేయకుండా నిషేధించాల్సిందిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కోరారు. 30 రోజుల పాటు అతను విమాన ప్రయాణం చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. ఎయిర్ ఏసియా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... బహుశా అతను మద్యం సేవించి ఉండటం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications