8 ఏళ్ల బాలికపై హత్యాచారం... దోషికి మరణశిక్ష విధించిన న్యాయస్థానం...
8 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడిన ఓ నిందితుడిని దోషిగా తేల్చిన పోక్సో న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. 2019లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ఏడాది కాలంగా విచారణ కొనసాగుతుండగా... తాజాగా న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేసింది.
వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్లోని చంద్పూర్కి చెందిన ఓ బాలిక(8) మార్చి,2019లో స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లింది. అలా వెళ్లిన బాలిక మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. అర్ధరాత్రి గడిచినా బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే చివరిసారిగా బాలికను శివ శంకర్,అలియాస్ బంటుతో రాత్రి 10గంటల సమయంలో చూసినట్లు కొంతమంది స్థానికులు ఆ తల్లిదండ్రులతో చెప్పారు.
ఆ మరుసటిరోజు ఉదయం బాలిక మృతదేహాన్ని ఓ గోధుమ పొలంలో గుర్తించారు. అప్పటికే బంటు,అతని తండ్రి గ్రామం విడిచి పారిపోయినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించి బంటుపై ఫిర్యాదు చేశారు. దీంతో బంటుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో బంటు నేరం అంగీకరించాడు.
రూ.10 ఇస్తానని ఆశజూపి ఆ బాలికను ఆకర్షించినట్లు బంటు పోలీసులతో చెప్పాడు. అనంతరం బాలికను ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి హత్యకు పాల్పడినట్లు చెప్పాడు. అత్యాచారం బయటపడుతుందన్న భయంతోనే బాలికను హత్య చేసినట్లు అంగీకరించాడు. మే,2019లో పోలీసులు అతనిపై చార్జీషీట్ ఫైల్ చేశారు. 20 నెలల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు విచారణలో మంగళవారం ఫిరోజాబాద్ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. బంటును దోషిగా తేల్చిన న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. అయితే బంటు ఈ తీర్పును ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేకపోలేదు.