నాలుగు లక్షల ఏళ్ల క్రితమే బెంగుళూరులో..
బెంగుళూరు : దేశంలో ఐటీకి కేరాఫ్ గా ఉన్న బెంగుళూరు అత్యంత పురాతన నగరంగాను వార్తల్లోకి ఎక్కుతోంది. తాజాగా ప్రాచీన మానవుని ఆనవాళ్లు బయటపడడంతో సుమారుగా నాలుగు లక్షల ఏళ్ల క్రితం నుంచే బెంగుళూరులో ఆదిమ మానవుల ఉనికి ఉన్నట్టుగా తేలింది. చరిత్ర పరిశోధకుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ కె.బి.తారక్ తాజా పరిశోధనల్లో భాగంగా బెంగుళూరులో రాతి యుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి.
తాజా పరిశోధనలను బట్టి ఆదిమ రాతియుగం నాటి మనుషులు నాలుగు లక్షల ఏళ్ల క్రితం బెంగుళూరులో మనుగడ సాగించినట్టుగా గుర్తించారు. కాగా గతంలో జరిపిన తవ్వకాల్లో మునుపెన్నడూ ఇంత ప్రాచీన చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభ్యం కాలేదన్నారు తారక్. నీటి పైపుల లీకేజీకి సంబంధించిన సమస్య తలెత్తి కదిరెనహల్లి ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో తాజా ఆధారాలు బయటపడ్డాయి.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలయజేస్తూ.. పైప్ లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించడానికి చేపట్టిన తవ్వకాల సందర్బంగా, ఆ ప్రాంతానికి సమీపంలోనే తాను ఉన్నానని చెప్పారు తారక్. దగ్గరలో తన నివాసం ఉండడంతో అక్కడి తవ్వకాలను ఆసక్తితో గమనించానని, తవ్వకాల సందర్బంగా బయటపడ్డ పలు రాళ్లను సేకరించి పరిశోధనలు జరిపితే ప్రాచీన చరిత్రకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయన్నారు.
కదిరెహనల్లిలో సేకరించిన రాళ్లకు గతంలో తాను తుముకూరు, మాండ్యా, చిత్రదుర్గ జిల్లాల నుంచి సేకరించిన రాళ్లకు పోలిక ఉన్నట్టుగా గుర్తించానని తెలిపారు. రెండింటి మధ్య ప్రాచీన పనిముట్లకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్టు చెప్పారాయన.
రాతియుగం నాటి మనుషుల పనిముట్ల గురించి ప్రస్తావిస్తూ.. చేతి గొడ్డలి, ఆకురాయి, సుత్తి, స్ఫటిక శిల వంటి ఐదు రాతి పనిముట్లను వనశంకరి ప్రాంతంలోని తవ్వకాల ద్వారా తాను సేకరించినట్టుగా తెలియజేశారు. వేట ప్రధానంగా సాగిన అప్పటి ఆదిమ మానవుడి జీవితం ఈ పనిముట్లతోనే ముడిపడి ఉండేదన్నారు. తాను సేకరించిన పలు చారిత్రక ఆనవాళ్లను పురాతత్వ కార్యాలయానికి సమర్పించినట్టుగా వెల్లడించారు.
అయితే ఇదే విషయంపై స్పందించిన మరో ప్రొఫెసర్ మాత్రం కాస్త భిన్నాభిప్రాయాన్నే వెల్లడించారు. కర్ణాటక విశ్వవిద్యాలయానికి చెందిన చరిత్ర పరిశోధకులు ప్రొఫెసర్ రవి మాట్లాడుతూ.. రాతియుగం నాటి మనుషులకు సంబంధించిన ఆనవాళ్లు గతంలో ఎన్నడూ బయటపడలేదన్నారు. అలాగే స్పటిక, రాతి పనిముట్లు వినియోగంలో ఉన్నట్టుగా ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని, కొత్తగా బయటపడిన స్ఫటిక, రాతి పనిముట్ల గురించి అంతు చిక్కకుండా ఉందని సంశయం వ్యక్తం చేశారు ప్రొఫెసర్ రవి.












Click it and Unblock the Notifications