భర్తను మోసం చేసిన భార్య : పెళ్లయిన విషయం దాచిపెట్టి..
అహ్మదాబాద్ : పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి మరో వ్యక్తిని వివాహమాడింది ముంబైకి చెందిన అన్షు అనే వివాహిత. రెండో పెళ్లి అనంతరం సదరు భర్త వివాహ రిజిస్ట్రేషన్ కోసం పట్టుబట్టడంతో.. ఎప్పుడూ విముఖత వ్యక్తం చేస్తూ వచ్చింది. ఇదే క్రమంలో... తన భార్యకు అంతకుముందే వివాహమైందని గుర్తించిన సదరు భర్త పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ కు చెందిన రవి బ్రహ్మభట్ ( 44) అనే వ్యక్తి లేటు వయసులో ముంబైకి చెందిన అన్షును వివాహం చేసుకున్నాడు. ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా ఈ ఇద్దరికీ వివాహం కుదిరింది. వివాహానంతరం రెండేళ్లు గడిచిపోయినా.. అన్షు మాత్రం వివాహ రిజిస్ట్రేషన్ కు ఎప్పుడూ 'నో' అంటూనే వస్తోంది.
దీంతో విసిగిపోయిన రవి.. ఈమధ్య భార్యపై మరింత ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. దీంతో ఏంచేయాలో అర్థంగాక తన తల్లిని పిలిపించుకుని విషయం గురించి చర్చించింది అన్షు. ఇదే క్రమంలో.. ఓరోజు ఇద్దరి మధ్య చర్చ జరుగుతుండగా.. అన్షుకి అంతకుమునుపే వివాహం జరిగిందన్న విషయం రవి చెవిన పడింది. దీంతో భార్య తనను మోసం చేసిందని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు రవి. విషయం తెలుసుకున్న అన్షు తన పుట్టింటికి వెళ్లిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.