తండ్రేనా: రెండేళ్ల కొడుకును రైలు కింద విసిరేశాడు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఓ తండ్రి.. తన రెండేళ్ల కుమారుడ్ని కదులుతున్న రైలు నుంచి విసిరేశాడు. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సమీనా ఖాన్(32), ఖాదిర్ ఖాన్(40) భార్యాభర్తలు. వారికి కైఫ్ ఖాన్ అనే రెండు సంవత్సరాల కొడుకున్నాడు. రంజాన్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనేందుకు దంపతులిద్దరూ ముంబైలోని బంధువుల ఇంటికొచ్చారు.
కాగా, బుధవారం కైఫ్ కనిపించలేదు. దీంతో కంగారులో సమీనా ఖాదిర్కు ఫోన్ చేసింది. అతను ఫోన్ లిప్ట్ చేయలేదు. బాబు కనిపించకపోవడంతో తల్లి సమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని కైఫ్ కోసం గాలించారు. అయితే కొద్ది గంటలకే ఖాదిర్ నుంచి సమీనాకు ఫోనొచ్చింది. బైకులా రైల్వే సమీపంలో ట్రైన్లో వెళుతున్న తను.. బాబును కదులుతున్న రైలు కింద పడేసినట్లు ఆమెకు చెప్పాడు. దీంతో సమీనా కుప్పకూలిపోయింది.
కైఫ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. తన భర్త ఎందుకిలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని సమీనా కన్నీరుమున్నీరుగా విలపించింది. ఖాదిర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.