జరిమానా: కరెంట్ బిల్లు రూ.11 లక్షలు, వారంలో కట్టకుంటే జైలు శిక్ష
న్యూఢిల్లీ: వికలాంగుడు, తినడానికి తిండి లేదు. తాను నివసిస్తోన్న ఇంటికి రూ. 11 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. కరెంట్ బిల్లు మొత్తాన్ని వారం రోజుల్లో కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పశ్చిమ ప్రాంతం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇండోర్లోని రమాబాయి నగర్ ప్రాంతంలో ప్రకాశ్ ఇంగ్లె నివసిస్తున్నాడు. ప్రకాశ్ ఇంగ్లె వికలాంగుడు కావడంతో అతని భార్య ఆ ప్రాంతంలో పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా చేస్తూ వచ్చిన జీతంతో తొమ్మిది మంది సభ్యులున్న కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.
ప్రకాశ్ ఇంగ్లె తన వీధిలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ద్వారా కరెంట్ని వినియోగిస్తున్నాడంటూ పవర్ డిస్ట్రిబ్యూషన్కు చెందిన విజిలెన్స్ అధికారులు జరిమానా కింద ఆ కుటుంబానికి రూ. 11,15,762 కరెంటు బిల్లు వేసినట్లు ఓ నోటీసు జారీ చేశారు.
అంతేకాదు ఈ మొత్తాన్ని వారం రోజుల్లో కట్టకపోతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆ నోటీసుల పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ జరిమానా నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ప్రకాశ్ ఇంగ్లె కుటుంబ సభ్యలు అందోళన చెందుతున్నారు.