దారుణం: స్నేహితుడిని చంపి ముక్కలుగా కోసి ఆపై ఏంచేశాడో తెలుసా..?
రోజురోజుకీ మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. అసలు సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ప్రాణాలు అంటే లెక్కలేకుండా పోతోంది. చాలా సింపుల్గా హత్యలకు పాల్పడుతున్నారు. సొంత కుటుంబంలోని వారినే కొందరు హత్య చేస్తుండగా మరికొందరు స్నేహితులనే హత్య చేస్తున్నారు. తాజాగా ఓ స్నేహితుడిని హత్య చేసిన ఉదంతం ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది.
కొల్హాద్కర్ను తోసేసిన పింటూ శర్మ
ముంబైలో నివసించే పింటు శర్మ (42), గణేష్ కోల్హద్కర్ (58)స్నేహితులు. ముంబై నగర శివారులో ఉండే విరార్లో వీరు నివాసం ఉంటున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. కోల్హద్కర్ త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం పింటు శర్మ నుంచి రూ.లక్ష బదులు తీసుకున్నాడు కోల్హద్కర్. తీసుకున్న అప్పులో రూ.40వేలు తిరిగి చెల్లించాడు. గతేడాది డిసెంబర్ 16న శర్మ, విరార్ ప్రాంతంలోని కొల్హాద్కర్ నివాసంలో కలిశాడు. ఇద్దరు అప్పటి వరకు బాగానే మాట్లాడుకున్నారు. అదే సమయంలో కొల్హాద్కర్ లేటు వయసులో వివాహం చేసుకుంటున్నాడంటూ అవహేళన చేశాడు పింటూ శర్మ. అంతేకాదు పెళ్లి అయితే తన భార్య అక్రమ సంబంధం కూడా పెట్టుకునే అవకాశం ఉందంటూ గేలి పట్టించాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగా శర్మ, కొల్హాద్కర్ను తోశాడు. గోడకు కొల్హాద్కర్ తల బలంగా కొట్టుకోవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
బ్లేడుతో శరీరాన్ని 200 ముక్కలు చేసిన శర్మ
ఇక మృతి చెందిన స్నేహితుడిని చూసి భయపడ్డాడు శర్మ. విషయం బయటకు పొక్కకముందే కొల్హాద్కర్ శరీరాన్ని బ్లేడుతో చిన్న ముక్కలుగా కోశాడు. దాదాపు 200 కు పైగా ముక్కలుగా కోశాడు. అది ఒక్కరోజులో కోయలేదు. దాదాపు నాలుగు రోజుల పాటు శరీరాన్ని చిన్న ముక్కలుగా కోశాడు. అలా చిన్న ముక్కలుగా కోశాక టాయ్లెట్లో వేసి ఫ్లష్ చేశాడు. ఇక పెద్ద ముక్కలుగా ఉన్న వాటిని తనతో పాటే తీసుకెళ్లి లోకల్ ట్రైనులో నుంచి బయటకు విసిరేశాడు.
డ్రైనేజీలో ఎముకలు ఇరుక్కోవడంతో బయటపడ్డ అసలు విషయం
తప్పుచేసిన ప్రతివాడు ఎక్కడో ఒక దగ్గర చిన్న క్లూ వదిలేసి వెళతాడు. కోల్హాద్కర్ శరీరాన్ని చిన్న ముక్కలుగా కోసి టాయ్లెట్లో పడేసి ఫ్లష్ చేశాడు. అయితే శరీరంలోని ఎముకలు, ఇతర భాగాలు డ్రైనేజీలో అడ్డుపడటంతో డ్రైనేజీ నీళ్లు బయటకు పొంగాయి. దీంతో డ్రైనేజీ క్లీన్ చేసేందుకు వచ్చిన వ్యక్తులు ఈ శరీర భాగాలను కనుగొనడంతో అసలు సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. వెంటనే పింటూ శర్మను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.