బార్యకొడుకుని చంపి, తాను కాల్చుకున్నాడు
అంకుర్ గుప్తా అనే 35 ఏళ్ల వ్యక్తి తన భార్య సారిక (32), కుమారుడు పార్థు (10)లను చంపి, తనను తాను కాల్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంకర్ గుప్తా చేనేత వస్త్రాల వ్యాపారి. అతనికి మాసూరి పారిశ్రామికవాడలో కర్మాగారం కూడా ఉంది. లండన్ నుంచి వచ్చిన అంకుర్ సోదరుడు అంకుష్ తమకు ఫోన్ చేశాడని, తాము చేరుకునే సరికి మూడు శవాలు పడి ఉన్నాయని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ రణవిజయ్ సింగ్ చెప్పారు.
అంకర్ శవం పడకపై పడి ఉందని, భార్య శవం బాత్రూంలో పడి ఉందని, కుమారుడి శవం దాని బయట పడి ఉందని ఆయన వివరించారు. సంఘటనా స్థలంలో తమకు మూడు షెల్స్ లభించాయని, అంకుర్ పాకెట్లో ఓ లైవ్ కాట్రిడ్డ్ లభించిందని ఆయన చెప్పారు.
అంకర్ పడకగదిలో తమకు పగిలిపోయిన ల్యాప్టాప్, అద్దం, వెంట్రుకలు లభ్యమైనట్లు ఆయన చెప్పారు. దీన్నిబట్టి అంకుర్కు, సారికకు మధ్య ఘర్షణ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నట్లు తెలిపారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ముగ్గురు చనిపోయి ఉంటారని, అయితే హత్యలు కూడా కావచ్చుననే కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.